హైదరాబాద్: ఐపీఎల్-8 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల వికెట్ల తేడాతో ముంబై గెలుపొంది ప్లేఆఫ్లో స్థానం సంపాదించింది. కీలక మ్యాచ్ లో అన్ని విభాగాల్లో విఫలం చెందడంతో హైదరాబాద్ లీగ్ దశలోనే ఇంటి దారి పట్టింది. ముంబై బౌలర్ల ధాటికి ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ బ్యాట్స్మెన్లు చేతులెత్తేయడంతో 20 ఓవర్లలో 113 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన ముంబై ఓపెనర్లు సిమ్మన్స్(48), పటేల్(51) ధాటిగా ఆడి 106 పరుగుల భాగస్వామ్యంతో మంచి శుభారంభాన్ని ఇచ్చారు. కరణ్ శర్మ బౌలింగ్లో సిమ్మన్స్(48) ధావన్కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రోహిత్(7), పార్థివ్ పటేల్తో కలిసి విజయానికి కావలసిన పరుగులని రాబట్టాడు. దీంతో ముంబై13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 114 పరుగులు లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ని ముంబై బౌలర్లు తక్కువస్కోరుకే పరిమితం చేశారు.7 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్(6), ధావన్(1) వికెట్లని కోల్పోయింది. 23 పరుగుల వద్ద మూడో వికెట్ రూపంలో మోర్గాన్(9) వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుసగా హెన్రిక్స్(11), ఓజా(0) లు వెనువెంటనే ఔటయ్యారు. నిలకడగా ఆడుతూ హైదరాబాద్ స్కోరుని పెంచే ప్రయత్నంలోనే రాహుల్(24) హర్భజన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆశిష్ రెడ్డి(17), , భవనేశ్వర్ కుమార్(0), కరణ్(15), ప్రవీణ్ కుమార్(4) పరుగులు చేసి ఔటయ్యారు. చివర్లో స్టెయిన్(17) ధాటిగా ఆడి పరుగులు రాబట్టి నాటౌట్గా నిలిచాడు.
ముంబై బౌలింగ్లో మెక్ క్లెనఘన్ మూడు వికెట్లు తీసి రాణించగా, సుచిత్, మలింగాలు తలా రెండు వికెట్లు తీశారు. హర్భజన్, పోలార్డ్ లకి చెరో వికెట్ లభించింది.
ముంబై బౌలింగ్లో మూడు వికెట్లు తీసి హైదరాబాద్ పరుగలకి ఆదిలోనే అడ్డుకట్ట వేసిన మెక్ క్లెనఘన్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.