సెన్సేషన్‌: 67 బంతుల్లో డబుల్‌ సెంచరీ | Sakshi
Sakshi News home page

సెన్సేషన్‌: 67 బంతుల్లో డబుల్‌ సెంచరీ

Published Sat, May 13 2017 12:24 PM

సెన్సేషన్‌: 67 బంతుల్లో డబుల్‌ సెంచరీ

ముంబై: టి20 మ్యాచ్‌లో సరికొత్త రికార్డు. పొట్టి ఫార్మాట్‌లో తొలిసారిగా డబుల్‌ సెంచరీ నమోదయింది. ముంబైకి చెందిన రిజ్వీ కాలేజీ బ్యాట్స్‌మన్‌ రుద్ర ధండే(19) ఈ ఘనత సాధించాడు. 67 బంతుల్లోనే ద్విశతకం బాది చరిత్ర సృష్టించాడు.

ముంబై యూనివర్సిటీ అంతర కాలేజీ క్రికెట్‌ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం మాతుంగ జింఖానా మైదానంలో రిజ్వీ, పి. దాల్మియా కాలేజీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ‘రుద్ర’తాండవం చేశాడు. రిజ్వీ కాలేజీ టీమ్‌ తరపున బరిలోకి దిగిన దండే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 67 బంతుల్లో 21 ఫోర్లు, 15 భారీ సిక్సర్లతో డబుల్‌ సెంచరీ చేసి అరుదైన రికార్డు సాధించాడు. రుద్ర విజృంభణతో రిజ్వీ టీమ్‌ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 322 పరుగులు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దాల్మియా జట్టు 10.2 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌటైంది. 247 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.

టి20లో డబుల్‌ సెంచరీ సాధించడం పట్ల ధండే అమితానందం వ్యక్తం చేశాడు. ‘మాటలు రావడం లేదు. ఇలా ఆడతానని ఊహించలేదు. మా తల్లిదండ్రుల పెళ్లిరోజుకు ఇది సరైన బహుమానం. నా ప్రదర్శన పట్ల మా నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆయనే నాకు కోచ్‌. ముంబై జట్టును త్వరలోనే ఎంపిక చేయనున్న నేపథ్యంలో మున్ముందు మంచి ఆటతీరు కనబరచాలని చెప్పార’ని రుద్ర తెలిపాడు. బ్యాటింగ్‌కు వెళ్లే ముందు టైమ్‌ లేకపోవడంతో బ్రేక్‌ఫాస్ట్‌ చేయలేదని, గ్లాసుడు పాలు మాత్రమే తాగానని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఆరాధించే రుద్ర భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని కృషి చేస్తున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement