Sakshi News home page

పాక్‌ ఫ్యాన్స్‌.. మీ మద్దతు ఎవరికి?

Published Thu, Jun 27 2019 6:20 PM

Nasser Hussains question to Pakistan fans for India vs England - Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో జరుగుతున్న వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ ఫేవరెట్‌ జట్టుగా బరిలోకి దిగింది. అయితే ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్‌ నాలుగింట మాత్రమే విజయం సాధించి ఎనిమిది పాయింట్లతో ఉంది. మంగళవారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓటమి చెందడంతో ఇక మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌లు ఆ జట్టుకు చాలా కీలకం. ఈ నేపథ్యంలో భారత్‌తో జరుగనున్న మ్యాచ్‌ ఇంగ్లండ్‌ విజయం సాధించి సెమీస్‌ రేసులోకి రావాలని భావిస్తోంది.


దీనిలో భాగంగా పాకిస్తాన్‌ ఫ్యాన్స్‌కు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసీర్‌ హుస్సేన్‌ ఒక ప్రశ్నకు సంధించాడు. ‘ ఇంగ్లండ్‌-భారత్‌ జట్ల మధ్య మ్యాచ్‌లో మీ మద్దతు ఎవరికి’ అని ట్వీటర్‌ వేదికగా ప్రశ్నించాడు. దీనికి పాక్‌ అభిమానుల నుంచి పెద్దగా సమాధానం రాకపోయినా, నాసీర్‌ హుస్సేన్‌ చేసిన ట్వీట్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ స్పందించాడు. ‘ ఇంతకీ నీ సపోర్ట్‌ ఎవరికి నాస్‌’ అంటూ ప్రశ్నించాడు. దీనికి నాసీర్‌ హుస్పేన్‌ స్పందిస్తూ.. ‘ తప్పకుండా ఇంగ్లండ్‌కే.. నువ్వు ఎలాగైతే ఇంగ్లండ్‌కు మద్దతిస్తావో అలానే. దక్షిణాఫ్రికాతో రగ్బీ జరిగే సందర్భాల్లో నువ్వు ఇంగ్లండ్‌కు ఎలాగైతే మద్దతు ఇస్తావో నేను కూడా అంతే’ అంటూ సమాధానమిచ్చాడు. ఇక్కడ నాసీర్‌ హుస్సేన్‌ భారత్‌లో పుట్టి ఇంగ్లండ్‌లో స్థిర పడిన విషయాన్ని పీటర్సన్‌ పరోక్షంగా ప్రస్తావించాడు. అదే సమయంలో దక్షిణాఫ్రికా సంతతికి చెందిన పీటర్సన్‌కు హుస్సేన్‌ తనదైన రీతిలో రిప్లై ఇవ్వడం గమనార్హం.

Advertisement
Advertisement