టీమిండియా మళ్లీ భయపడాల్సిన పనిలేదు! | Sakshi
Sakshi News home page

టీమిండియా మళ్లీ భయపడాల్సిన పనిలేదు!

Published Fri, Jan 12 2018 9:21 PM

No need to panic about our batting section, says Virat Kohli - Sakshi

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఓటమి తర్వాత విచిత్రమైన విమర్శలు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను, కోచ్ రవిశాస్త్రిని వెంటాడుతున్నాయని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. కేప్‌టౌన్‌ టెస్టుకు ముందు అజింక్య రహానే తుదిజట్టులో ఉంటాడా.. లేదా అని క్రికెట్ విశ్లేషకులు, మాజీలు భావించారు. కానీ అనూహ్యంగా ఆ టెస్టు ఓటమి తర్వాత భిన్న స్వరాలు వినిపిస్తున్నాయని కోహ్లీ చెప్పాడు. రహానే లాంటి ఆటగాడికి చోటుంటుందా అని ఆలోచించిన అదే వ్యక్తులు ఇప్పుడు అలాంటి నిలకడైన క్రికెటర్‌ను తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదంటూ అడగటం నవ్వు తెప్పిస్తుందన్నాడు.

జట్టుకు ప్రస్తుతం భారంగా మారిన ఓపెనింగ్ సమస్యపై ప్రధానంగా దృష్టిపెట్టాం. రెండో టెస్టు గురించి ఎలాంటి భయాలు మాలో లేవు. ఇంకా చెప్పాలంటే మా బ్యాటింగ్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. జట్టు సమతూకంగా ఉండటమే ముఖ్యం. బయటి వ్యక్తుల అభిప‍్రాయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. విదేశాల్లో రహానే అద్భుతంగా ఆడతాడని గతంలోనే చెప్పాను. అయితే ప్రస్తుత ఫామ్ పరంగా రోహిత్ శర్మను తీసుకున్నామని’ కోహ్లీ గుర్తుచేశాడు. దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్‌ల గురించి ముందే తెలిసినా కొన్ని పొరపాట్ల వల్ల తొలిటెస్టులో ఓడిపోయాం. ఓటమి నుంచి తప్పులను సరిదిద్దుకుని పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతామని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. రేపటి (శనివారం) నుంచి సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది.

Advertisement
Advertisement