కరాచీ: ఆరేళ్ల తర్వాత సొంతగడ్డపై అంతర్జాతీయ మ్యాచ్ చూస్తున్న ఆనందం... పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో ఎన్నడూ లేని కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. పాక్, జింబాబ్వే టి20 మ్యాచ్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూసిన అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. కొద్ది వ్యవధిలోనే అన్నీ అమ్ముడుపోయాయి. ఆ తర్వాత బ్లాక్లోనూ కొనేశారు. తెలిసినవారి దగ్గర తీసుకోగలిగిన వారు అవీ తెచ్చుకున్నారు. కానీ కొందరు వీరాభిమానులకు మాత్రం టికెట్లు దక్కలేదు. స్వదేశంలో క్రికెట్ మ్యాచ్ చూడటాన్ని మించిన పని ఇప్పుడు ఏమీ లేదనుకున్నారేమో... వారు ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీదే పడ్డారు.
పీసీబీ కార్యాలయంలోకి చొరబడి 1500 రూపాయల విలువ గల 600 టికెట్లు చోరీ చేశారు. ఒక వైపు చోరీ గురించి పోలీసులకు సమాచారం అందించినా... మరోవైపు పోతే పోనీలే పెద్ద విలువేం లేదు, అసలు అభిమానులు మ్యాచ్ చూస్తే చాలు, మాకు అదే తృప్తి అంటూ పాక్ బోర్డు అధికారులు సన్నాయి నొక్కులతో సరిపుచ్చారు.