అలా కలిసొస్తోంది! | Sakshi
Sakshi News home page

అలా కలిసొస్తోంది!

Published Wed, Nov 2 2016 11:39 PM

అలా కలిసొస్తోంది!

16 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు... 22 వికెట్లు... 33 సగటు...

ఈ గణాంకాలతో భారత టెస్టు జట్టులోకి బౌలింగ్ ఆధారంగా ఓ ఆటగాడు ఎంపికవుతాడనేది ఊహించని అంశం. కానీ హార్ధిక్ పాండ్యా ఇవే అంకెలతో భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు... ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ద్వారా దాదాపుగా అరంగేట్రం చేయడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది.

23 ఏళ్ల ఈ బరోడా ఆల్‌రౌండర్ ఇప్పటివరకు నాలుగు వన్డేలు, 16 అంతర్జాతీయ టి20లు ఆడాడు. ఈ ఏడాది జనవరి 26న ఆస్ట్రేలియాలో  టి20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. టి20 ప్రపంచకప్ వరకూ భారత జట్టులో కొనసాగాడు. అరుుతే ఐపీఎల్‌లో పేలవ ఫామ్ వల్ల జింబాబ్వే పర్యటనకు ఎంపిక కాలేదు. కానీ ఆస్ట్రేలియా ‘ఎ’ పర్యటనకు ఎంపిక కావడం తన కెరీర్‌ను మార్చేసింది. ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ దగ్గర తను చాలా మెరుగయ్యాడు. అదే పర్యటనకు అప్పటి సెలక్టర్, ప్రస్తుత సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా వెళ్లారు. పాండ్యా ప్రోగ్రెస్‌ను ఆయన దగ్గరి నుంచి గమనించారు. ఇవన్నీ తనకి కలిసొచ్చారుు. వచ్చే ఏడాది చాంపియన్‌‌స ట్రోఫీ ఇంగ్లండ్‌లో జరుగుతున్నందున ఒక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను వెతకాలనే ఆలోచనతో పాండ్యాను వన్డే జట్టులోకి తెచ్చారు. కపిల్ దేవ్ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకున్న పాండ్యా ఆడిన తొలి మ్యాచ్‌లోనే అద్భుతంగా బౌలింగ్ చేసి సెలక్టర్ల అంచనాలను నిలబెట్టాడు. ధోనిని కూడా ఆకట్టుకున్నాడు. తన తొలి మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో పిచ్ స్పిన్‌కు అనుకూలించిన విశాఖలో తను బెంచ్‌కు పరిమితమయ్యాడు. కారణం... తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు. ఇద్దరు స్పిన్నర్లు సరిపోతారనుకునే పిచ్ మీద మూడో పేసర్‌గా, ఆల్‌రౌండర్ స్లాట్‌లో ఆడించడానికే తనని తీసుకున్నారని అందరికీ స్పష్టత వచ్చింది.

అరుుతే టెస్టు జట్టులోకి ఇంత తొందరగా వస్తాడని మాత్రం ఎవరూ ఊహించలేదు. కేవలం పది నెలల వ్యవధిలో మూడు ఫార్మాట్లలోకీ ప్రస్తుతం ఉన్న పోటీలో రావడం నిజంగా గొప్ప విషయమే. నిజానికి ఇంగ్లండ్ స్పిన్ బలహీనత వల్లే పాండ్యా జట్టులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన సమయమంలో కొత్త బంతిపై పేస్‌ను తీయడానికి రెండో పేసర్‌గా తను పనికొస్తాడు. ఇక బ్యాట్స్‌మన్‌గా ఇప్పటికే కొంతవరకు తనని తాను నిరూపించుకున్నాడు.

ముగ్గురిలో ఉత్తమం
నిజానికి భారత్‌కు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కొరత చాలా కాలంగా ఉంది. స్టువర్ట్ బిన్నీ ఇంతకాలం అడపాదడపా ఆ పాత్ర పోషిస్తూ వచ్చాడు. అరుుతే తనకు ఎన్ని అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేదు. బ్యాట్స్‌మన్‌గా కొంత ఫర్వాలేదనిపించినా బౌలర్‌గా తను అంతంత మాత్రమే. ఇక రిషి ధావన్ బౌలర్‌గా ఉత్తమం. కానీ బ్యాటింగ్‌లో అంతగా ఆకట్టుకోలేదు. నిజానికి రిషి రంజీట్రోఫీలో కూడా నిలకడగా ఆడుతున్నాడు. న్యాయంగా అరుుతే పాండ్యా కంటే ముందు తను జట్టులోకి రావాలి. బ్యాటింగ్‌లో పాండ్యా మిగిలిన ఇద్దరి కంటే ఉత్తమం. కివీస్‌తో వన్డే సిరీస్ ద్వారా బౌలర్‌గా కూడా ఎదుగుదల చూపించడంతో మరో ఆలోచన లేకుండా జట్టులోకి వచ్చాడు. ఏదేమైనా ఇది తనకు సవర్ణావకాశం. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో లభించే ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే తన కలలను సాకారం చేసుకోగలుగుతాడు. ప్రస్తుతం ఒక రకంగా హార్ధిక్ పాండ్యా సీజన్ నడుస్తోంది. తనకు అంతా కలిసొస్తోంది. ఇక భవిష్యత్ ఏంటనేది పూర్తిగా అతని చేతుల్లోనే ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement