దేవుడా.. ఆ పరిస్థితి రానీయకు అనుకున్నా | Sakshi
Sakshi News home page

దేవుడా.. ఆ పరిస్థితి రానీయకు అనుకున్నా: కోహ్లి

Published Wed, Nov 8 2017 10:51 AM

Pandya injury in final over made Virat Kohli nervous - Sakshi

తిరువనంతపురం: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ-20 మ్యాచ్‌లో చివరి ఓవర్‌ వేసిన హార్థిక్‌ పాండ్యాకు గాయం అవ్వడం.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని తీవ్రంగా టెన్షన్‌ పెట్టిందట. సిరీస్‌ను నిర్ణయించే కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత్‌, న్యూజిలాండ్‌పై థ్రిల్లింగ్‌ విక్టరీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

వర్షంతో ఎనిమిది ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో విజయానికి కివీస్‌ జట్టుకు 19 పరుగులు కావాలి. ఈ దశలో విరాట్‌ బంతిని పాండ్యాకు అప్పగించాడు. స్లో బంతితో పాండ్యా చివరి ఓవర్‌ను ప్రారంభించాడు. మొదటి బాల్‌కు బై రూపంలో మిచెల్‌ సాంటర్న్‌ పరుగు తీశాడు. ఇక, రెండో బంతికి అసలు డ్రామా చోటుచేసుకుంది. పాండ్యా విసిరిన ఈ బంతిని కివీస్‌ బ్యాట్స్‌మన్‌ కలిన్‌ డీ గ్రాండ్‌హామ్‌ స్ట్రయిట్‌ షాట్‌ బాదాడు. తనైవైపు దూసుకొచ్చిన బాల్‌ను క్యాచ్‌ చేసేందుకు ప్రయత్నించిన పాండ్యా చేతివేలికి గాయమైంది. దీంతో టీమిండియాలో ఆందోళన.. వెంటనే జట్టు ఫిజియో నిపుణుడు ప్యాట్రిక్‌ ఫర్హర్ట్‌ మైదానంలోకి వచ్చి పాండ్యాకు సపర్యలు చేశాడు. దీంతో ఫిట్‌ అయిన పాండ్యా చివరి ఓవర్‌ను విజయవంతంగా పూర్తిచేశాడు. మూడో బంతిని గ్రాండ్‌హోమ్‌ భారీ సిక్సర్‌ కొట్టినా.. తర్వాతి బంతులను పాండ్యా కట్టుదిట్టంగా విసరడంతో టీమిండియా ఆరుపరుగుల తేడాతో విజయం సాధించింది.

అయితే, చివరి ఓవర్‌లో పాండ్యా గాయపడటం తనను త్రీవంగా టెన్షన్‌ పెట్టిందని మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ కోహ్లి తెలిపాడు. ’హార్థిక్‌ చివరి ఓవర్‌ బాగా వేశాడు. హార్థిక్‌ గాయపడినప్పుడు.. దేవుడా.. చివరి నాలుగు బంతులు నేను వేసే పరిస్థితి రానీయకు అన్నట్టు నేనుండిపోయాను’ అంటూ కోహ్లి నవ్వుతూ చెప్పాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఏడో ఓవర్‌ బుమ్రాకు ఇవ్వాల్సిందిగా తనకు రోహిత్‌ శర్మ, ఎంఎస్‌ ధోనీ సూచించారని, బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని కోహ్లి కొనియాడాడు. పాండ్యా కూడా చివరి ఓవర్‌ను బాగా వేశాడని కితాబిచ్చాడు. మ్యాచ్‌ అనంతరం మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తోపాటు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు బుమ్రాకు లభించాయి.

Advertisement
Advertisement