లాహోర్:వన్డే వరల్డ్ కప్ లో పేలవమైన ఫామ్ తో వరుస రెండు ఓటములను మూటగట్టుకున్న పాకిస్థాక్ క్రికెట్ టీమ్ పై లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీమిండియా, వెస్టిండీస్ జట్లపై ఓటమికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ షర్ యార్ అహ్మద్ ఖాన్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నజామ్ సేథీలే కారణమని.. వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని న్యాయవాది రిజ్వాన్ గుల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు ఆ మ్యాచ్ ల్లో పాకిస్థాన్ ఓటమిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆ పిటిషన్ లో న్యాయవాది కోరారు.
ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నజామ్ పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ క్రికెట్ సెలెక్షన్ లో కీలకపాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చాలా మంది పాకిస్థాన్ క్రికెటర్ల సెలెక్షన్ నైపుణ్యం ఆదారంగా జరగలేదని న్యాయవాది పిటిషన్ లో తెలిపారు. దీనిపై జస్టిస్ ఇజాజుల్ హసన్ నేతృత్వంలోని హైకోర్టు మంగళవారం విచారణ జరుపనుంది.