రాజ్కోట్:భారత-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీల మోత మోగుతోంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో మూడు సెంచరీలు సాధిస్తే... మూడో రోజు ఆటలో భారత్ రెండు సెంచరీలు నమోదు చేసింది. భారత తొలి ఇన్నింగ్స్ లో ముందుగా చటేశ్వర పూజారా శతకం నమోదు చేస్తే, ఆ తరువాత కాసేపటికి మురళీ విజయ్ సెంచరీ సాధించాడు. పూజారా 169 బంతుల్లో 15 ఫోర్లతో శతకం సాధిస్తే, మురళీ విజయ్ 256 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ చేశాడు.
63/0 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ఆరంభంలోనే గౌతం గంభీర్(29) ను తొలి వికెట్ గా కోల్పోయింది. ఆపై విజయ్ తో కలిసిన పూజారా భారత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఒకవైపు విజయ్ క్లాసికల్ టచ్ ను ఇస్తే, పూజారా మాత్రం తన శైలికి భిన్నంగా బ్యాట్ ఝుళిపించాడు. కేవలం ఈ రోజు ఆటలో తొలి రెండు సెషన్లలో ఒక వికెట్ ను మాత్రమే కోల్పోయిన భారత్.. ఇంగ్లండ్ కు దీటైన జవాబిస్తోంది. అంతకముందు ఇంగ్లండ్ జట్టులో మూడు వ్యక్తిగత సెంచరీలు నమోదైన సంగతి తెలిసిందే. జో రూట్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్లు సెంచరీలు సాధించారు.