సెంచూరియన్: టెస్టుల్లో ఎంతో ఘనమైన రికార్డు ఉన్న భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు చతేశ్వర పుజారా చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇక్కడ జరిగిన రెండో టెస్టులో పుజారా.. రెండు ఇన్నింగ్స్ల్లోనూ రనౌట్గా పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్లో గోల్డెన్ డకౌట్గా రనౌట్ రూపంలో అవుటైన పుజారా.. రెండో ఇన్నింగ్స్లోనూ వికెట్ల మధ్య పరుగెత్తడంలో విఫలమై రనౌట్ అయ్యాడు. తద్వారా ఒక టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లోనూ రనౌట్గా అవుటైన తొలి భారత క్రికెటర్గా పుజారా అపప్రథను సొంతం చేసుకున్నాడు.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన లక్ష్యం 287 పరుగులు. ఇది మంచి లక్ష్యమే అయినప్పటికీ, కష్ట సాధ్యమేమీ కాదు. ప్రధానంగా పుజారా రెండు సార్లు రనౌట్ కావడంతో పాటు, మొదటి ఇన్నింగ్స్లో హార్దిక్ పాండ్యా రనౌట్గా పెవిలియన్ చేరడంతో మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. గతేడాది అత్యధిక టెస్టు పరుగులు సాధించిన ఓవరాల్ ఆటగాళ్ల జాబితాలో పుజారా(1140) రెండో స్థానంలో నిలిచిని సంగతి తెలిసిందే.