క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్ | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్

Published Fri, Apr 22 2016 12:37 AM

క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్

జ్వాల-అశ్విని జంట కూడా
చైనా మాస్టర్స్ టోర్నీ

 
జియాంగ్‌సు (చైనా): సింగిల్స్‌లో బరిలో ఉన్న ఏకైక భారత క్రీడాకారిణి పీవీ సింధు చైనా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ సింధు 21-9, 21-17తో చియెన్ హు యు (చైనీస్ తైపీ)పై అలవోకగా గెలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్‌సుక్ (థాయ్‌లాండ్)తో సింధు తలపడుతుంది.

ముఖాముఖి రికార్డులో సింధు 5-3తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21-10, 21-15తో డారెన్ లూ (మలేసియా)ను ఓడించాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా)తో ప్రణయ్ ఆడతాడు. 

మహిళల డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం ముందంజ వేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో జ్వాల-అశ్విని 21-12, 21-12తో సెయి పె చెన్-వు తి జుంగ్ (చైనీస్ తైపీ) లపై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ ద్వయం 17-21, 12-21తో వాంగ్ యిల్యు-జాంగ్ వెన్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది.
 

Advertisement
Advertisement