'నేను ఆడితే.. టీమిండియా క్రికెటర్లను పంపరట' | Sakshi
Sakshi News home page

'నేను ఆడితే.. టీమిండియా క్రికెటర్లను పంపరట'

Published Sat, Oct 14 2017 1:23 PM

Raj Kundra dropped as cricketers refuse to play ball with him - Sakshi

న్యూఢిల్లీ: ఇప్పటివరకూ ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్ తో బిజీ బిజీగా గడిపిన భారత క్రికెటర్లు ఇప్పడు 'సెలబ్రిటీ క్లాసికో' ఫుట్ బాల్ ఈవెంట్ కు సన్నద్ధమవుతున్నారు. ఓ ఛారిటీకి నిధులు సేకరించే క్రమంలో  ఆదివారం అంధేరీలో బాలీవుడ్ సెలబ్రిటీలతో విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత క్రికెటర్లు ఫుట్ బాల్ మ్యాచ్ కు సిద్ధమయ్యారు. ఇందులో కోహ్లితో పాటు మహేంద్ర సింగ్ ధోని, మనీష్ పాండే, మొహ్మద్ షమీలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. కాగా, సెలబ్రిటీ క్లాసికో తాజా ఈవెంట్ నుంచి వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను తప్పించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో రాజస్థాన్ రాయల్స్ మాజీ సహ యజమాని అయిన రాజ్ కుంద్రా ఆడకుండా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) షాకిచ్చింది. గతంలో ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న కారణంగా రాజ్ కుంద్రాను ముందుగానే పక్కన పెట్టేశారు. దీనిపై బీసీసీఐ నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా కూడా కుంద్రాకు అందింది. తనను ఫుట్ బాల్ మ్యాచ్ నుంచి తప్పించిన విషయాన్ని ముంబై మిర్రర్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో రాజ్ కుంద్రా  స్పష్టం చేశారు.


'ఆ ఫుట్ బాల్ మ్యాచ్ లో నేను ఆడితే బీసీసీఐ తమ ఆటగాళ్లను పంపమనే విషయాన్ని నాకు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఫుట్ బాల్ మ్యాచ్ ను నిర్వహిస్తున్న జీఎస్ ఎంటర్ టైనమెంట్ కు రాత పూర్వకంగా తెలియజేశా. కానీ వారి నుంచి కూడా సరైన సమాధానం లేదు. దాంతో ఫుట్  బాల్ లీగ్ కు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇక వేరే దారి లేదు. ముందుగా నాకు జీఎస్ నుంచి కాల్ వచ్చింది. అయితే బీసీసీఐ అడ్డుకోవడంతో ఇక చేసేదేమీ లేదు' అని రాజ్ కుంద్రా ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, కుంద్రా వ్యాఖ్యలపై బీసీసీఐ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ఈ మ్యాచ్ లో అటు విరాట్ నేతృత్వంలోని క్రికెటర్లు, అభిషేక్ బచ్చన్ సారథ్యంలోని బాలీవుడ్ స్టార్లు పాల్గొనున్నారు.

Advertisement
Advertisement