ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం

Published Sun, Apr 12 2015 7:27 PM

ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం

ఢిల్లీ:  ఐపీఎల్-8లో భాగంగా ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ఇక్కడ ఫిరోజషా కోట్ల మైదానంలో జరిగిన ఉత్కంఠ పోరులో  రాజస్థాన్ రాయల్స్  మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 185 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ చివరి బంతికి జయభేరీ మోగించింది. రాజస్థాన్ ఆటగాళ్లలో అజ్యింకా రహానే(47), హూడా(54)పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

 

రాజస్థాన్ ఆదిలో వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడినట్లు కనిపించినా తిరిగి పుంజుకుని చిరస్మరణీయమైన విజయాన్ని చేజిక్కించుకుంది. ఫల్కనర్(17) పరుగుల వద్ద ఏడో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరిన తరుణంలో మ్యాచ్ ఢిల్లీ వైపు మొగ్గింది. అయితే క్రిస్ మోరిస్(13), సౌతీ(7)పరుగులతో చివరి వరకూ క్రీజ్ లో ఉండి మిగతా పనిని పూర్తి చేశారు.  ఢిల్లీ బౌలర్లలో ఇమ్రాన్ తహీర్ నాలుగు  అమిత్ మిశ్రాకు రెండు వికెట్లు తీసినా ఢిల్లీకి విజయాన్ని అందివ్వలేకపోయారు.  దీంతో టోర్నీలో రాజస్థాన్ రెండు విజయాలు సాధించగా, ఢిల్లీ మరో పరాజయాన్ని చవిచూసింది.



అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ ఆదిలో దూకుడుగా ఆడింది. మయాంక్ అగర్వాల్(37), అయ్యర్(40)పరుగులు చేసి ఢిల్లీకి మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే మధ్యలో కాస్త నెమ్మదించిన ఢిల్లీ.. చివర్లో మరోసారి పుంజుకుంది. ఢిల్లీ ఆటగాళ్లలో యువరాజ్ సింగ్(27)పరుగులు చేసి మరోసారి నిరాశపరిచినా.. జేపీ డుమినీ, మాథ్యూస్ లు రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. డుమినీ(44), మాథ్యూస్(27)పరుగులతో నాటౌట్ గా ఉండటంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది.

Advertisement
Advertisement