కర్ణాటకకు షాక్ | Sakshi
Sakshi News home page

కర్ణాటకకు షాక్

Published Sat, Dec 5 2015 1:23 AM

Ranji Trophy: Maharashtra knock out champs Karnataka

ముంబై: వరుసగా రెండేళ్ల పాటు రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచిన కర్ణాటక ఈసారి లీగ్ దశతోనే సరిపెట్టుకుంది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మహారాష్ట్రపై కనీసం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినా నాకౌట్‌కు అర్హత సాధించే స్థితిలో... కర్ణాటక జట్టు 53 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో గ్రూప్ ‘ఎ’లో 24 పాయింట్లతో ఐదోస్థానంలో నిలిచి లీగ్ దశతోనే సరిపెట్టుకుంది. ఈ గ్రూప్ నుంచి విదర్భ (29 పాయింట్లు), బెంగాల్ (28), అస్సాం (26) క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. హర్యానా గ్రూప్ ‘సి’కి పడిపోయింది.
 
గ్రూప్ ‘బి’ టాపర్ ముంబై
ఇక గ్రూప్ ‘బి’ నుంచి ముంబై జట్టు అగ్రస్థానం (35 పాయింట్లు)తో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పంజాబ్ (26), మధ్యప్రదేశ్ (24) తర్వాతి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్‌కు చేరాయి. ఈ గ్రూప్‌లో గుజరాత్ కూడా మధ్యప్రదేశ్‌తో 24 పాయింట్లతో సమంగా నిలిచినా... మెరుగైన రన్‌రేట్ కారణంగా ఎంపీ ముందుకెళ్లింది. ఇదే గ్రూప్ నుంచి ఆంధ్ర జట్టు ఆఖరి స్థానంలో నిలవడం ద్వారా గ్రూప్ ‘సి’కి పడిపోయింది. వచ్చే ఏడాది ఆంధ్ర జట్టు హైదరాబాద్‌తో కలిసి గ్రూప్ ‘సి’లో మ్యాచ్‌లు ఆడుకుంటుంది.
 
నాకౌట్‌కు సౌరాష్ట్ర, జార్ఖండ్
ఇక గ్రూప్ ‘సి’ నుంచి సౌరాష్ట్ర, జార్ఖండ్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించడంతో పాటు వచ్చే ఏడాది గ్రూప్ ‘ఎ’... ‘బి’లలో ఆడేందుకు అర్హత సాధిం చాయి. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో జార్ఖండ్ 10 వికెట్లతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. దీంతో 31 పాయింట్లతో సౌరాష్ట్ర (36) తర్వాత రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌కు చేరింది. ఈ గ్రూప్‌లో హైదరాబాద్ 8 మ్యాచ్‌ల ద్వారా 8 పాయింట్లు సాధించి చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.

Advertisement
Advertisement