సింధు, సైనా శుభారంభం | Sakshi
Sakshi News home page

సింధు, సైనా శుభారంభం

Published Thu, Nov 16 2017 12:11 AM

Saina Nehwal, PV Sindhu in Round 2 of China Open badminton - Sakshi

ఫుజౌ (చైనా): మాజీ చాంపియన్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ సింధు 24–22, 23–21తో సయాకా సాటో (జపాన్‌)పై కష్టపడి గెలుపొందగా... సైనా 21–12, 21–13తో బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)పై అలవోకగా నెగ్గింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో అకానె యామగుచి (జపాన్‌)తో సైనా, హాన్‌ యుయి (చైనా)తో సింధు తలపడతారు.పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. సౌరభ్‌ వర్మ 14–21, 21–15, 11–21తో బ్రైస్‌ లెవెర్‌డెజ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోగా... హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 18–21, 21–16, 21–19తో డాంగ్‌ కెయున్‌ లీ (కొరియా)పై విజయం సాధించాడు.

పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 13–21, 13–21తో లియు చెంగ్‌–జాంగ్‌ నాన్‌ (చైనా) జంట చేతిలో... సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి జోడీ 18–21, 15–21తో గిడియోన్‌–సుకముల్జో (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయాయి. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 14–21, 15–21తో హా నా బేక్‌–చె యు జుంగ్‌ (కొరియా) జోడీ చేతిలో... మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప ద్వయం 19–21, 21–17, 13–21తో మథియాస్‌ క్రిస్టియాన్సన్‌–క్రిస్టినా పెడర్సన్‌ (డెన్మార్క్‌) జంట చేతిలో ఓడింది. 

Advertisement
Advertisement