సాక్షి ‘కర్మ సిద్ధాంతం’ | Sakshi
Sakshi News home page

సాక్షి ‘కర్మ సిద్ధాంతం’

Published Wed, Apr 12 2017 12:24 AM

సాక్షి ‘కర్మ సిద్ధాంతం’

పుణే: ఐపీఎల్‌లో ధోనిని కెప్టెన్సీ నుంచి తొలగించి ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్న రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ యాజమాన్యం ఆ తర్వాత అతని బ్యాటింగ్‌ను కూడా విమర్శించింది. అయితే జట్టులో సభ్యుడిగా ఉన్న ధోని నుంచి దీనిపై ఎలాంటి స్పందన లేకపోయినా ధోని సతీమణి సాక్షి సింగ్‌ మాత్రం తన అసంతృప్తిని దాచుకోలేకపోయింది. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లో ట్వీట్ల ద్వారా ఆమె తన అసహనాన్ని ప్రదర్శించింది. తన వ్యాఖ్యలతో నేరుగా కాకపోయినా పరోక్షంగా పుణే మేనేజ్‌మెంట్‌కు గురి పెట్టింది. ముందుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు హెల్మెట్‌ ధరించి ఫొటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసిన సాక్షి ఆ జట్టుపై అభిమానాన్ని చాటుకుంది.

ఎనిమిదేళ్ల పాటు ఐపీఎల్‌లో చెన్నై టీమ్‌ కెప్టెన్‌గా ధోని అనుభవించిన వైభవం గురించి అందరికీ తెలిసిందే. తన రెండో ట్వీట్‌లో సాక్షి పరిస్థితులు మారినంత మాత్రాన ఎవరినీ తక్కువగా చూడరాదంటూ కర్మ సిద్ధాంతాన్ని ప్రవచించింది. ‘పక్షి బతికి ఉన్నప్పుడు చీమలను తింటుంది. కానీ అది చనిపోయాక చీమలే దానిని తింటాయి. సమయం, పరిస్థితులు ఎప్పుడైనా మారిపోవచ్చు. జీవితంలో ఎవరినీ తక్కువ చేసి చూడవద్దు. ఎవరినీ బాధ పెట్టవద్దు. ఈ రోజు నువ్వు బలవంతుడివే కావచ్చు. కానీ సమయం అంతకంటే బలమైంది. ఒక చెట్టు నుంచి లక్షల సంఖ్యలో అగ్గి పుల్లలు తయారు చేయవచ్చు కానీ ఒక్క అగ్గిపుల్లతో లక్షలాది చెట్లను కాల్చవచ్చు. కాబట్టి మంచిగా ఉండండి. మంచిగా వ్యవహరించండి’ అని సాక్షి రాసింది!

Advertisement
Advertisement