సానియా, పేస్ జోడీలకు చుక్కెదురు | Sakshi
Sakshi News home page

సానియా, పేస్ జోడీలకు చుక్కెదురు

Published Fri, Jul 8 2016 2:09 AM

Sania Mirza-Martina Hingis crash out of Wimbledon 2016 in quarters

లండన్: డిఫెండింగ్ చాంపియన్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... వింబుల్డన్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 2-6, 4-6తో ఐదోసీడ్ టిమియా బాబోస్ (హంగేరి)-ష్వెదోవా (కజకిస్తాన్)ల చేతిలో పరాజయం చవిచూశారు. 68 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఇండో-స్విస్ జోడి అంచనాలకు అనుగుణంగా రాణించలేదు. తొలిసెట్‌లో మూడు, ఏడో గేమ్‌లో సర్వీస్‌ను చేజార్చుకుని సెట్‌ను కోల్పోయారు.


ఇక రెండోసెట్‌లోనూ ఒకటి, నాలుగు గేమ్‌ల్లో సర్వీస్ కోల్పోవడంతో బాబోస్-ష్వెదోవా 5-1 ఆధిక్యంలోకి వెళ్లారు. అయితే ఏడు, తొమ్మిదో గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకున్న సానియా జంట ఎనిమిదో గేమ్‌లో ప్రత్యర్థుల సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆధిక్యాన్ని 4-5కు తగ్గించింది. కానీ పదో గేమ్‌లో ష్వెదోవా-బాబోస్ సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో సానియా-హింగిస్‌లకు ఓటమి తప్పలేదు. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో లియాండర్ పేస్-హింగిస్ జోడి 6-3, 3-6, 2-6తో కాంటినెన్ (ఫిన్లాండ్)-వాట్సన్ (బ్రిటన్) చేతిలో ఓడింది.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement