ఫైనల్లో భారత్ ‘ఎ’ | Sakshi
Sakshi News home page

ఫైనల్లో భారత్ ‘ఎ’

Published Tue, Aug 13 2013 3:44 AM

Shikhar Dhawan 's record double ton puts India A in final

 ప్రిటోరియా: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత ‘ఎ’ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం ఇక్కడ జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 39 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టును ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 433 పరుగుల భారీ స్కోరు సాధించింది. శిఖర్ ధావన్ (150 బంతుల్లో 248; 30 ఫోర్లు, 7 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ చతేశ్వర్ పుజారా (97 బంతుల్లో 109 నాటౌట్; 8 ఫోర్లు) ధాటిగా ఆడి సెంచరీ చేశాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 33.2 ఓవర్లలోనే 285 పరుగులు జోడించారు. మురళీ విజయ్ (37 బంతుల్లో 40; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. 
 
 అనంతరం దక్షిణాఫ్రికా జట్టు కూడా పోటాపోటీగా పరుగులు సాధించింది. భారీ లక్ష్యానికి బెదరకుండా చివరి వరకూ గెలుపు కోసం శ్రమించింది. ఆ జట్టులో ఇద్దరు బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించినా లాభం లేకపోయింది. దక్షిణాఫ్రికా 48.4 ఓవర్లలో 394 పరుగులకు ఆలౌటైంది.  జార్స్‌వెల్డ్ (91 బంతుల్లో 108; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), హెండ్రిక్స్ (78 బంతుల్లో 106; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలు సాధించారు. భారత బౌలర్లలో ఈశ్వర్ పాండే 4 వికెట్లు పడగొట్టగా... ఉనాద్కట్‌కు 2 వికెట్లు దక్కాయి. బుధవారం జరిగే ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా ‘ఎ’తో తలపడుతుంది. 
 
 ధావన్ ఇన్నింగ్స్ సాగిందిలా...
 31 బంతుల్లో 50 (8 ఫోర్లు)
 86 బంతుల్లో 100 (13 ఫోర్లు)
 108 బంతుల్లో 150 (17 ఫోర్లు, 3 సిక్స్‌లు)
  132 బంతుల్లో 200 (24 ఫోర్లు, 4 సిక్స్‌లు)
  150 బంతుల్లో 248 (30 ఫోర్లు, 7 సిక్స్‌లు) 
 
 50 ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టుకు ఇదే (433) అత్యధిక స్కోరు. అంతర్జాతీయ వన్డేల్లో భారత్ అత్యధిక స్కోరు 418/ 5 (వెస్టిండీస్‌పై). 
 
 ఓవరాల్‌గా లిస్ట్ ఎ క్రికెట్‌లో అత్యధిక స్కోర్ల జాబితాలో భారత్ ‘ఎ’ సాధించిన స్కోరు ఆరో స్థానంలో ఉంది. 2007లో కౌంటీలో సర్రే టీమ్ అత్యధికంగా 4 వికెట్లకు 496 పరుగులు చేసింది. 
 

Advertisement
Advertisement