స్మిత్‌, వార్నర్‌ల నిషేధం ముగిసినా.. దక్కని చోటు! | Sakshi
Sakshi News home page

స్మిత్‌, వార్నర్‌ల నిషేధం ముగిసినా.. దక్కని చోటు!

Published Fri, Mar 8 2019 10:30 AM

Smith and Warner Out of Australia ODI Series Against Pakistan - Sakshi

సిడ్నీ : బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లు తమ ఏడాదికాల నిషేధాన్ని ఈ నెల 28తో పూర్తిచేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో పాకిస్తాన్‌తో జరిగే 5 వన్డేల సిరీస్‌తో ఈ ఇద్దరు ఆటగాళ్లు పునరాగమనం చేస్తారని అందరూ భావించారు. కానీ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) మాత్రం పాకిస్తాన్‌తో జరిగే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఈ నిషేధిత ఆటగాళ్లకు అవకాశం కల్పించలేదు. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌కు ప్రస్తుతం భారత్‌తో ఆడుతున్న ఆసీస్‌ జట్టునే సీఏ ప్రకటించింది. స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌కు సైతం అవకాశం దక్కలేదు. అయితే స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లు గాయాల నుంచి కోలుకోవడంపై దృష్టి పెట్టారని, వారి పునరాగమనానికి ఇండియన్‌ ప్రీమియల్‌ లీగ్‌(ఐపీఎల్‌) సరైనదిగా భావిస్తున్నారని ఆ జట్టు సెలక్షన్‌ ఛైర్మెన్‌ ట్రెవెర్‌ హాన్స్‌ తెలిపారు.

ఐపీఎల్‌.. ప్రపంచ దిగ్గజాలు పాల్గొనే ఓ అత్యుత్తమైన టోర్నీగా ఆయన అభివర్ణించారు. డేవిడ్‌ వార్నర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున, స్మిత్‌ రాజస్థాన్‌ నుంచి బరిలోకి దిగుతారని పేర్కొన్నారు. ప్రపంచకప్‌, యాషెస్‌ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని వారి ఆటను పరిశీలిస్తామన్నారు. ఇక భారత్‌తో ఆడుతున్న ప్రస్తుత జట్టు అదరగొడుతుందని కితాబిచ్చారు. టీ20 సిరీస్‌ను కైవసం చేసుకొని మంచి శుభారంభం ఇచ్చారని, రెండు వన్డేల్లోనూ గట్టిపోటీనిచ్చారని కొనియాడారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement