డు ప్లెసిస్‌ అజేయ సెంచరీ | Sakshi
Sakshi News home page

డు ప్లెసిస్‌ అజేయ సెంచరీ

Published Mon, Mar 4 2019 1:15 AM

South Africa win over Sri Lanka in first ODI - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: స్వదేశంలో తొలిసారి శ్రీలంక చేతిలో టెస్టు సిరీస్‌లో ఓడిపోయిన దక్షిణాఫ్రికా... వన్డే సిరీస్‌లో మాత్రం శుభారంభం చేసింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (114 బంతుల్లో 112 నాటౌట్‌; 15 ఫోర్లు, సిక్స్‌) అజేయ సెంచరీ చేసి తమ జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. తొలుత శ్రీలంక జట్టు 47 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. ఒషాదా ఫెర్నాండో (49 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్‌ మెండిస్‌ (73 బంతుల్లో 60; 5 ఫోర్లు, సిక్స్‌) రాణించారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్‌గిడి, ఇమ్రాన్‌ తాహిర్‌ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం దక్షిణాఫ్రికా 38.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. క్వింటన్‌ డి కాక్‌ (72 బంతుల్లో 81; 11 ఫోర్లు), డు ప్లెసిస్‌ రెండో వికెట్‌కు 136 పరుగులు జోడించారు. డి కాక్‌ ఔటయ్యాక... వాన్‌ డెర్‌ డసెన్‌ (43 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు), డు ప్లెసిస్‌ మూడో వికెట్‌కు అజేయంగా 82 పరుగులు జత చేసి దక్షిణాఫ్రికాను విజయ తీరాలకు చేర్చారు. రెండో వన్డే బుధవారం జరుగుతుంది.   

Advertisement

తప్పక చదవండి

Advertisement