ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు చట్టబద్ధత!

16 Jul, 2017 13:40 IST|Sakshi
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు చట్టబద్ధత!
న్యూఢిల్లీ: భారత్‌లో క్రీడల ప్రోత్సాహానికి నిధుల కొరత ఉండటంతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ భావిస్తోంది. దీనికి  సంబంధించిన న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేందుకు డ్రాఫ్ట్‌ను తయారు చేస్తోంది. వచ్చే రెండెళ్లలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని ఆ శాఖ ప్రణాళిక రచిస్తోంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ద్వారా ప్రభుత్వానికి వచ్చే నిధులతో క్రీడలను ప్రోత్సహించాలనుకుంటుంది. ఇప్పటికే  భారత్‌లో చట్ట వ్యతిరేకంగా ఏడాదికి రూ 9.6 లక్షల కోట్ల బెట్టింగ్‌ జరుగుతుంది. దీంతో దీనిని చట్ట బద్ధం చేస్తే పన్నుల రూపంలో క్రీడాశాఖకు నిధులు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హార్స్‌ రేసింగ్‌లపై బెట్టింగ్‌లు చట్టబద్ధంగా ఉండగా కేంద్రం వీటిపై 28శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. ఇటీవల ఈ విషయంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ అధికారులతో సమావేశమై చర్చించారు.
 
క్రీడాశాఖ ఆర్ధిక పరిస్ధితి మెరుగుపరచడం, ప్రపంచానికి గొప్ప క్రీడాకారులను పరిచయం చేయడం తమ అభిమతం అని క్రీడామంత్రిత్వ శాఖ పేర్కొంది. బెట్టింగ్‌ అనేది ఓ సున్నితమైన సామాజిక రాజకీయ సమస్యా అని పేర్కొంది. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్‌, స్పాట్‌ ఫిక్సింగ్‌ వివాదాలు చెలరేగే అవకాశం ఉండడతో ఆచుతూచి ప్రణాళిక సిద్దం చేస్తున్నామని తెలిపింది. గతంలో సుప్రీం కోర్టుకు క్రికెట్‌ బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని చాల మంది అభిప్రాయపడినట్లు లోథా కమిటీ తమ నివేదికలో పేర్కొంది. ఇది ఇప్పటికే యూకేలో అమలవుతుందని  సూచించింది.
మరిన్ని వార్తలు