చాంపియన్‌ శ్రీకృష్ణ–సృష్టి జంట | Sakshi
Sakshi News home page

చాంపియన్‌ శ్రీకృష్ణ–సృష్టి జంట

Published Mon, May 28 2018 10:46 AM

Sri Krishna and Srushti Pair got Badminton Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా జూనియర్‌ అండర్‌–19 ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుడు పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తమిళనాడులోని తిరుపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలంగాణకే చెందిన సృష్టి జూపూడితో కలిసి విజేతగా నిలిచిన శ్రీకృష్ణ... పురుషుల డబుల్స్‌లో విష్ణువర్ధన్‌ గౌడ్‌ (తెలంగాణ)తో కలిసి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.

ఆదివారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ పోరులో టాప్‌ సీడ్‌ శ్రీకృష్ణ–సృష్టి (తెలంగాణ) ద్వయం 21–17, 21–16తో ఎడ్విన్‌ జాయ్‌–నఫీషా సారా సిరాజ్‌ (కేరళ) జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ మంజిత్‌ సింగ్‌–డింకూ సింగ్‌ (మణిపూర్‌) జంట 21–13, 21–18తో టాప్‌సీడ్‌ విష్ణువర్ధన్‌–శ్రీకృష్ణ (తెలంగాణ) జోడీకి షాక్‌ ఇచ్చింది. మహిళల డబుల్స్‌ విభాగంలో తెలంగాణ ప్లేయర్‌ సృష్టి తన భాగస్వామితో కలిసి రన్నరప్‌గా నిలిచింది. తుది పోరులో మూడోసీడ్‌ సృష్టి (తెలంగాణ)–ప్రీతి (ఆంధ్రప్రదేశ్‌) జంట 16–21, 16–21తో టాప్‌సీడ్‌ సిమ్రన్‌–రితిక (మహారాష్ట్ర) జంట చేతిలో ఓటమి పాలైంది. మహిళల సింగిల్స్‌ విభాగంలో పాండిచ్చేరికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి ఎస్‌. కవిప్రియ 8–21, 11–21తో టాప్‌ సీడ్‌ ఆకర్షి కశ్యప్‌ (ఛత్తీస్‌గఢ్‌) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రియాన్షు రావత్‌ (మధ్యప్రదేశ్‌) 21–14, 19–21, 21–16తో ఐదోసీడ్‌ కిరణ్‌ జార్జ్‌ (కేరళ)పై నెగ్గి చాంపియన్‌గా నిలిచాడు. 

Advertisement
Advertisement