సెప్టెంబర్‌లో ఐపీఎల్‌! | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లో ఐపీఎల్‌!

Published Sun, Jun 14 2020 3:30 AM

Sunil Gavaskar Proposes New Dates And Venue For IPL - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నమెంట్‌కు భారత్‌ ఆతిథ్యమిచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఇంకా కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో... ఐపీఎల్‌కు శ్రీలంక లేదా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వేదికగా నిలిచే అవకాశముందని... సెప్టెంబర్‌ తొలి వారంలో ఈ టోర్నీ జరగొచ్చని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆ దేశ ప్రభుత్వం మైదానాల్లోకి 25 శాతం మంది ప్రేక్షకులు రావొచ్చని నిబంధనలు సడలించింది.

దాంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌–నవంబర్‌లలో ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్‌కప్‌ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని గావస్కర్‌ అంచనా వేశారు. ఒకవేళ టి20 ప్రపంచకప్‌ జరిగితే ఐపీఎల్‌ నిర్వహణకు కావాల్సినంత సమయం ఉండదని ఆయన అన్నారు. ‘వర్షాకాలంతోపాటు కరోనా ఇంకా తగ్గుముఖం పట్టని కారణంగా సెప్టెంబర్‌లో భారత్‌లో ఐపీఎల్‌ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అదే సమయంలో శ్రీలంకలో లేదా యూఏఈలో ఈ టోర్నీని నిర్వహించవచ్చు. ఒక్కో జట్టు మరో జట్టుతో రెండుసార్లు కాకుండా ఒకేసారి తలపడే విధంగా షెడ్యూల్‌ను తయారు చేయాల్సి ఉంటుంది’ అని ఆయన తెలిపారు. 

Advertisement
Advertisement