రెచ్చిపోయిన రైనా.. భారత్ భారీ స్కోరు | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన రైనా.. భారత్ భారీ స్కోరు

Published Wed, Aug 27 2014 7:02 PM

రెచ్చిపోయిన రైనా.. భారత్ భారీ స్కోరు

కార్డిఫ్: సురేష్ రైనా (75 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 100) మెరుపు సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లండ్తో రెండో వన్డేలో భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారమిక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ధోనీసేన పూర్తి ఓవర్లలో ఆరు వికెట్లకు 304 పరుగులు చేసింది. ధోనీ (52), రోహిత్ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు.

భారత్ ఆరంభంలో 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ధవన్ 11 పరుగులకే పెవిలియన్ చేరగా, విరాట్ కోహ్లీ డకౌటయ్యాడు. వోక్స్ ఒకే ఓవర్లో వీరిద్దరినీ  అవుట్ చేశాడు. ఈ దశలో రోహిత్, రహానె జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్కు 91 పరుగులు జోడించారు. కాగా హాఫ్ సెంచరీకి చేరువలో రహానె (41) అవుటవగా, రోహిత్ (52) హాఫ్ సెంచరీ చేసిన వెంటనే వెనుదిరిగాడు. భారత్ 32 ఓవర్లలో నాలుగు వికెట్లకు 140 పరుగులు చేసింది. ఈ దశలో స్కోరు 250 దాటడం కష్టమనిపించింది. అయితే రైనా రెచ్చిపోవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ధోనీ అండగా నిలవడంతో రైనా ఫోర్లు, సిక్సర్లతో విజృంభించాడు. 49 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రైనా మరో 25 బంతుల్లో సెంచరీ పూర్తి చేయడం విశేషం. కాగా సెంచరీ చేసిన రైనా వెనుదిరిగాడు. ధోనీ కూడా హాఫ్ సెంచరీ చేసిన అనంతరం అవుటయ్యాడు. అయితే భారత్ అప్పటికే భారీ స్కోరు సాధించింది. జడేజా, అశ్విన్ స్కోరును 300 మార్క్ దాటించారు.
 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement