మెరిసిన తనయ్, ప్రణీత్‌ రెడ్డి | Sakshi
Sakshi News home page

మెరిసిన తనయ్, ప్రణీత్‌ రెడ్డి

Published Tue, Feb 6 2018 10:41 AM

tanay, praneeth reddy shine for nizamabad victory - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 (టీటీఎల్‌) లీగ్‌లో నిజామాబాద్‌ నైట్స్‌ జట్టు బోణీ చేసింది. బ్యాట్స్‌మన్‌ తనయ్‌ త్యాగరాజన్‌ (38 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడైన అర్ధసెంచరీతోపాటు, చివర్లో పి. ప్రణీత్‌ రెడ్డి (11 బంతుల్లో 32; 1 ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో జట్టు తొలి విజయాన్ని అందుకుంది. ఎంఎల్‌ఆర్‌ గ్రౌండ్స్‌లో సోమవారం శ్రీనిధియాన్‌ థండర్‌ బోల్ట్స్‌ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో నిజామాబాద్‌ నైట్స్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీనిధియాన్‌ థండర్‌ బోల్ట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. డానీ ప్రిన్స్‌ (56 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), విఠల్‌ అనురాగ్‌ (43 బంతుల్లో 73; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ధాటిగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 133 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పా రు. అనంతరం నిజామాబాద్‌ నైట్స్‌ 19.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి గెలుపొందింది. తనయ్, సూరజ్‌(23) తొలి వికెట్‌కు 89 పరుగుల్ని జోడించారు. అనురాగ్‌ హరిదాస్‌ (26; 3 ఫోర్లు) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఫహాద్, సన్నీ, అనిరుధ్, ప్రిన్స్‌ తలా వికెట్‌ తీశారు. ప్రణీత్‌ కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.  

నల్లగొండ లయన్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో ఖమ్మం టిరా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన నల్లగొండ లయన్స్‌ జట్టు 19.5 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. ఆశిష్‌ రెడ్డి (41 బంతుల్లో 56; 7 ఫోర్లు, 1 సిక్స్‌), హబీబ్‌ అహ్మద్‌ (30 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఖమ్మం టిరా జట్టు జునైద్‌ అలీ (41 బంతుల్లో 51 నాటౌట్‌; 7 ఫోర్లు), అస్కారి (40 బంతుల్లో 51 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీలతో చెలరేగడంతో 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సాయి కుమార్‌ (26 బంతుల్లో 42; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడు ప్రదర్శించాడు.

Advertisement
Advertisement