ఫుట్‌బాల్ స్టేడియంలో ధోనీ మెరుపులు | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్ స్టేడియంలో ధోనీ మెరుపులు

Published Sun, Jul 31 2016 2:10 PM

ఫుట్‌బాల్ స్టేడియంలో ధోనీ మెరుపులు - Sakshi

రాంచీ: టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రస్తుతం ఫుట్ బాల్ మైదానంలో దూసుకుపోతున్నాడు. ఇటీవల కాలంలో కుటుంబం(కూతురు జీవా)తో ఎక్కువ సమయం గడుపుతున్న ధోనీ తీరిక సమయాలలో తనకు ఇష్టమైన ఫుట్ బాల్ ఆడుతున్నాడు. శనివారం జార్ఖండ్ రాజధాని సమీపంలోని సిల్లీ ఆస్ట్రో టర్ఫ్ స్డేడియంలో సాకర్ మ్యాచ్ ఆడి 6-2 తేడాతో రాంచీ ఎలెవన్ పై  తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సిల్లీ స్పోర్ట్స్ అకాడమీ తరఫున ఆడిన ధోనీ ప్రొఫెషనల్ ఆటగాళ్లతో పోటీపడి ఒక గోల్ చేశాడు. దాంతో పాటు రెండు గోల్స్ చేయడంలో తనవంతు పాత్ర పోషిస్తూ సహచరులకు పాస్ అందించాడు ధోనీ. మ్యాచ్ కొనసాగుతున్నంతసేపు 'మహీ.. మహీ..' అంటూ స్డేడియం మొత్తం ధోనీ పేరు మార్మోగిపోయింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ మాట్లాడుతూ... 'చాలా రోజుల తర్వాత ఫుల్ టైం సాకర్ మ్యాచ్ ఆడాను. మ్యాచ్ ఫుల్ ఎంజాయ్ చేశాను. కుటుంబంతో గడిపేందుకు కాస్త సమయం దొరుకుతుంది. అందుకే వీలుచిక్కినప్పుడు ఇలాంటి ఈవెంట్లలో పాల్గొంటాను' అని పేర్కొన్నాడు. రాజకీయ నాయకుడు, ఫ్రెండ్ అయిన సుదేశ్ మహతో పిలుపు మేరకు సిల్లీ స్పోర్ట్స్ అకాడమీ తరఫున గేమ్ లో పాల్గొన్నాడు. ధోనీ రాకతో ఆటగాళ్లు కూడా స్ఫూర్తి పొందారని, ధోనీ మిడ్ ఫిల్డర్ గా గేమ్ లో కొనసాగాడని సుదేశ్ తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించిన ఇద్దరు క్రీడాకారిణులకు ధోనీ తన చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశాడు.

Advertisement
Advertisement