2016లో వెస్టిండీస్ లో జరుగనున్న టీమిండియా టూర్ రద్దు కానుందా?తాజా సమీకరణాలు చూస్తే అవుననక తప్పదు. తాజాగా విండీస్ జట్టు ఇండియాలో టూర్ ను అర్ధాంతరంగా ముగించి స్వదేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కూడా అదే పంథాలో వెళ్లాలనే యోచనలో ఉంది. వెస్టిండీస్ టూర్ లో 3 టెస్ట్లు, 5 వన్డేలు, 2 టీ ట్వంటీల టూర్ రద్దు చేసుకోవాలనే డిమాండ్ కూడా బీసీసీఐ ముందుకు రానుంది.వెస్టిండీస్ టూర్ రద్దుపై రేపు హైదరాబాద్లో బీసీసీఐ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్ అధ్యక్షతన వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశం జరుగనుంది. ఈ టూర్ రద్దుతో భారీ నష్టాలు వాటిల్లినందున వెస్టిండీస్ నుండి నష్ట పరిహారాన్ని ఈ సమావేశంలో డిమాండ్ చేసే చాన్సుంది. నిజానికి నష్ట పరిహారం విషయంలో బోర్డు లీగల్ సెల్ సమర్పించే సూచనలపై వర్కింగ్ కమిటీ ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా మన దేశంలో వెస్టిండీస్ టూర్ అర్ధాంతరంగా రద్దవడంతో తలెత్తిన పరిస్థితిని ఈ సమావేశంలో సమీక్షిస్తారు. వెస్టిండీస్ టూర్ రద్దుతో మొత్తం 17 రోజుల లైవ్ క్రికెట్ రద్దయింది.
శ్రీలంకతో జరిగే సిరీస్తో ఐదు రోజుల లైవ్ క్రికెట్ ఏర్పాటుకు నష్ట నివారణ కొంత వరకు తగ్గినా, 12 రోజుల లైవ్ క్రికెట్ రద్దుతో నష్టాలు ఓ మోతాదులో వుండే చాన్సుంది. వెస్టిండీస్ నుండి 400 కోట్ల డిమాండ్ అంశాన్ని కూడా చర్చకు తేనున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్లో బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయం కీలకం కానుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం విండీస్ క్రికెట్ బోర్డు పరిస్థితి డైలామాలో పడింది. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ తో పాటు, ప్రపంచ కప్ లో విండీస్ ఆడుతుందా?లేదా అనేది ప్రశ్నార్ధకరంగా మారింది.