ఈ రోజు యువీకి చాలా స్పెషల్ | Sakshi
Sakshi News home page

ఈ రోజు యువీకి చాలా స్పెషల్

Published Tue, Sep 19 2017 2:01 PM

ఈ  రోజు యువీకి చాలా స్పెషల్

న్యూఢిల్లీ: ఈ రోజు క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయమైనది.  డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్కు వెరీ వెరీ స్పెషల్. సరిగ్గా పదేళ్లక్రితం ఇదేరోజు యువరాజ్ ఆడిన సంచలన ఇన్నింగ్స్ గుర్తుండే ఉంటుంది. 2007 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో యువరాజ్ సింగ్ చెలరేగిపోయాడు. ఆ ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటికీ సగటు భారత క్రికెట్ అభిమాని గుండె ఉప్పొంగి పోతుంది.

2007లో తొలి టి-20 ప్రపంచ కప్ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. సెప్టెంబర్ 19న ఇంగ్లండ్, టీమిండియా జట్ల మధ్య మ్యాచ్కు డర్బన్ ఆతిథ్యమిచ్చింది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు గంభీర్, సెహ్వాగ్ జట్టుకు 136 పరుగుల శుభారంభం అందించారు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రాబిన్ ఊతప్ప  అవుటయ్యాడు. అప్పటికి స్కోరు 155/3. మరో మూడు ఓవర్లు మిగిలున్నాయి. ఆ సమయంలో యువీ ఐదోస్థానంలో బ్యాటింగ్కు దిగాడు. యువీ ఆడిన తొలి ఆరు బంతుల్లో మూడు ఫోర్లు బాదాడు. 19 ఓవర్లో యువీ స్ట్రయికింగ్ కాగా, స్టువర్ట్ బ్రాడ్ బౌలర్. ఈ ఓవర్లో ఎవరూ ఊహించని విధంగా యువీ అద్భుతమైన రికార్డు నెలకొల్పాడు.

 

బ్రాడ్ వేసిన ఆరుబంతుల్ని యువీ ఆరు అద్భుతమైన సిక్సర్లు సంధించాడు.  స్టేడియంలో, టీవీల ద్వారా మ్యాచ్ చూస్తున్న అభిమానులను యువీ సిక్సర్లతో కనువిందుచేశాడు. టి20క్రికెట్లో ఓ ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్మన్గా, ఓవరాల్గా క్రికెట్ చరిత్రలో నాలుగో ఆటగాడి యువీ చరిత్ర సృష్టించాడు.  యువీ ఈ మ్యాచ్లో 16 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 18 పరుగులతో గెలిచింది.

Advertisement
Advertisement