మొదటి మ్యాచ్ హిట్. రెండో మ్యాచైతే రోహిట్! ఇక మిగిలింది ఆఖరి మ్యాచ్. ఇందులో గెలిస్తే భారత్ క్లీన్స్వీప్ చేస్తుంది. శ్రీలంకతో సిరీస్ను అజేయంగా ముగిస్తుంది. 2017 సంవత్సరా నికి విజయవంతంగా వీడ్కోలు చెబుతుంది. టీమిండియా టాప్ ఆర్డర్ అసాధారణ ఫామ్లో ఉన్న దృష్ట్యా ఇదేమంత కష్టం కాదు. ఎటొచ్చి శ్రీలంకే అన్ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇప్పుడు మూడో మ్యాచ్లో ఎలాగైనా గెలిచి పరువుతో లంకకు పయనం కావాలనుకుంటోంది.
ముంబై: సిరీస్ ఇండోర్లోనే చేతికొచ్చింది. బ్యాట్స్మెన్ పరుగుల హోరెత్తిస్తున్నారు. బౌలర్లు జోరు మీదున్నారు. ఓవరాల్గా చూస్తే భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక మిగిలింది క్లీన్స్వీపే. ముంబైలోనూ గెలిస్తే 3–0తో పొట్టి ఫార్మాట్ సిరీస్నూ ముగించవచ్చు. శ్రీలంకను రిక్తహస్తాలతో ఇంటికి పంపొచ్చు. ఈ ఏడాది భారత్ ఆడే చివరి మ్యాచ్ ఇది. విజయవంతంగా నడిపించిన 2017ను దిగ్విజయం గా ముగించే సువర్ణావకాశం టీమిండియా చేతిలో ఉంది. తిసారా పెరీరా సేన మాత్రం తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. టెస్టుల్లో పోరాడింది. వన్డేల్లో (తొలి మ్యాచ్) షాకిచ్చింది. కానీ మెరుపుల సిరీస్లో మాత్రం భారత్ ధాటికి నిలువలేకపోతోంది. రెండు టి20లతో పాటు సిరీస్ను కోల్పోయిన శ్రీలంక లక్ష్యం ఒక్కటే... పరువు నిలబెట్టుకోవడం. ఆదివారం జరిగే మ్యాచ్లో గెలిచి ఊరట విజయంతో స్వదేశానికి పయనం కావాలని గట్టిగా భావిస్తోంది.
ధాటిని కొనసాగిస్తారా...
టెస్టు, వన్డే సిరీస్ల తొలి మ్యాచ్లో ప్రత్యర్థి పేస్కు విలవిల్లాడిన భారత బ్యాట్స్మెన్ టి20 సిరీస్లో మాత్రం చెలరేగి ఆడుతున్నారు. తొలి రెండు మ్యాచ్ల్ని ఏకపక్షంగా ముగించడంలో బ్యాటింగ్ దళమే ప్రధాన పాత్ర పోషించింది. కెప్టెన్ రోహిత్, శ్రేయస్ అయ్యర్, లోకేశ్ రాహుల్ ఎదురులేని ఫామ్లో ఉన్నారు. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ రాహుల్ అర్ధసెంచరీలతో కదంతొక్కాడు. సారథి రోహిత్ విశ్వరూపానికి ఇండోర్ వేదిక మొదటి సాక్షి అయ్యింది. వెటరన్ స్టార్ ధోని కూడా ఫామ్లో ఉన్నాడు. రెండు మ్యాచ్ల్లోనూ బరిలోకి దిగిన ఈ మాజీ సారథి షరామామూలుగా ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. బౌలింగ్ విభాగాన్ని పరిశీలిస్తే గత రెండు మ్యాచ్లను స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్ తమ మణికట్టు మాయాజాలంతో ప్రభావితం చేశారు. ముఖ్యంగా ఇండోర్ మ్యాచ్లో పది పరుగుల రన్రేట్తో వెళుతున్న లంక బ్యాట్స్మెన్ను అనూహ్యంగా కట్టడి చేశారు. వాంఖడేలోనూ వీళ్లిద్దరు జోరు కొనసాగించాలనుకుంటున్నారు. పేసర్లు బుమ్రా, హార్దిక్ పాండ్యా కూడా తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మ్యాచ్లో ఉనాద్కట్ స్థానంలో బాసిల్ థంపికి అవకాశం దక్కొచ్చు.
ఇక మిగిలిందొక్కటే... పరువు!
మరోవైపు పర్యాటక జట్టు శ్రీలంక పరిస్థితి మాత్రం దీనంగా ఉంది. టెస్టు సిరీస్ పోయింది. వన్డే సిరీస్ చేజారింది. టి20 సిరీస్ను కాస్త అడ్వాన్స్గా... చివరి మ్యాచ్కు ముందే ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. ఇక మిగిలింది పరువు. అందుకే ఆఖరి పోరులో ఎలాగైన నెగ్గి భారత్ చేతిలో వైట్వాష్ బారి నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. ప్రత్యర్థి భీకర ఫామ్ దృష్ట్యా ఇదేమంత సులభం కాదని లంకకు ఇప్పటికే అర్థమైంది. గత రెండు మ్యాచ్ల్ని భారీ తేడాతో కోల్పోయిన ఈ జట్టు భారత్కు ఎదురు నిలవాలంటే సర్వశక్తులు ఒడ్డాల్సిందే. మరీ ముఖ్యంగా బ్యాటింగ్లో నిలకడ కావాలి. డిక్వెలా, తరంగ, కుశాల్ పెరీరా రెండో మ్యాచ్లో బాగా ఆడారు. అయితే మిడిలార్డర్ బ్యాట్స్మెన్ మాత్రం మూకుమ్మడిగా చేతులెత్తేయడం టీమ్ మేనేజ్మెంట్ను ఆందోళన పరు స్తోంది. బౌలర్లు కూడా ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు ధారా ళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. పైగా ఇప్పుడు బ్యాటింగ్కు అనుకూలమైన వాంఖడే పిచ్పై ఏ మేరకు రాణిస్తారో చూడాలి. గాయంతో ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. అతని స్థానంలో షనక బరిలోకి దిగుతాడు.
పిచ్, వాతావరణం
వాంఖడే పిచ్ బ్యాట్స్మెన్కు స్వర్గధామం. అవలీలగా పరుగులు సాధించవచ్చు. 190 పరు గుల లక్ష్యమైనా ఛేదించవచ్చు. దీంతో ప్రేక్షకులకు మరో మెరుపుల విందు ఖాయం. మంచు ప్రభావం ఉంటుంది. వాన ముప్పులేదు. - రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం