బాబోయ్ మేం వెళ్లలేం! | Sakshi
Sakshi News home page

బాబోయ్ మేం వెళ్లలేం!

Published Tue, Feb 10 2015 8:08 AM

బాబోయ్ మేం వెళ్లలేం!

సిడ్నీ: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌కు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం అందుబాటులో ఉన్న 50 వేల టిక్కెట్లు ఎప్పుడో అమ్ముడయ్యాయి. కానీ ఈ మ్యాచ్ చూడటానికి అందరూ రాలేకపోతున్నారట. సిడ్నీ, మెల్‌బోర్న్, బ్రిస్బేన్ నగరాలకు చెందిన అభిమానులు సుమారు 20 వేల మంది ఈ మ్యాచ్ టిక్కెట్లు ఇంతకుముందే కొనుక్కున్నారు. వారిలో కొంతమంది గతంలోనే ఫ్లయిట్ టిక్కెట్లు, హోటల్స్ బుక్ చేసుకున్నారు. సుమారు 5 వేల మంది మాత్రం ఇంకా విమానం టిక్కెట్లు కొనలేదు.

ఇప్పుడు కొందామని వెళితే ఒక్కో టిక్కెట్ 800 డాలర్లు (సుమారు రూ. 40 వేలు) దాటిపోయింది. మామూలు రోజుల్లో ఈ టిక్కెట్ 200 నుంచి 300 డాలర్లు మాత్రమే ఉంటుంది. అదే విధంగా 100 డాలర్లు ఉండే హోటల్ రూమ్ ధర ఒక్కసారిగా 300 డాలర్లకు పెరిగిపోయింది. ఒక కుటుంబంలో ఇద్దరు వెళ్లి మ్యాచ్ చూడాలంటే సుమారు 2 వేల డాలర్లు ఖర్చు అవుతుందట. ఇంత డబ్బు ఖర్చు చేస్తే భారత్ వెళ్లి 10 రోజులు సెలవులు గడిపిరావచ్చని అభిమానులు భావిస్తున్నారు. కాబట్టి ఈసారి భారత్-పాక్ మ్యాచ్‌లో కొన్ని ఖాళీ సీట్లు కనిపిస్తాయేమో..!

Advertisement
Advertisement