కోహ్లి నిరూపించుకునే సమయం | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 29 2018 5:00 PM

Time For Kohli To Show He Can Score Runs In England - Sakshi

లండన్‌:టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ఆటగాడిగా, కెప్టెన్‌గా రికార్డుల మీద రికార్డులు అతడి సొంతం.. తనకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఇంగ్లండ్‌ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అంటూ  ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ పేర్కొన్నాడు. 2014లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో 13.50 సగటుతో కేవలం 134 పరుగులు చేసి కోహ్లి తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. 

37 టెస్టులు 3699 పరుగులు
ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమైన కోహ్లి.. తిరిగి పుంజుకుని అసాధరణ ఆటతో చెలరేగిపోయాడని ఈ ఆసీస్‌ మాజీ బౌలర్‌ పేర్కొన్నాడు. 2014 టెస్టు సిరీస్‌ అనంతరం 37 టెస్టులు ఆడిన కోహ్లి 64.89 సగటుతో 3699 పరుగులు సాధించాడని.. ఇందులో15 సెంచరీలు, ఆరు ద్విశతకాలు ఉన్నాయని గుర్తుచేశాడు.  ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌ అయిన టీమిండియా సారథి తాను ఏంటో నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మెక్‌గ్రాత్‌ తెలిపాడు. 

ఆసీస్‌ పిచ్‌లకు ఇంగ్లండ్‌ పిచ్‌లకు అదే తేడా
ఆసీస్‌ పిచ్‌లపై వీరవిహారం చేసిన  విరాట్‌ కోహ్లి ఇంగ్లండ్‌ పిచ్‌లపై తడబడటానికి గల కారణాలు మెక్‌గ్రాత్‌ వివరించాడు. బంతి దూసుకొస్తూ, బౌన్స్‌ అయ్యే పిచ్‌లు ఆసీస్‌ సొంతమని.. ఇంగ్లండ్‌ పిచ్‌లు అలాకాదని విపరీతంగా స్వింగ్‌ అవడంతో బ్యాట్స్‌మెన్‌ ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నాడు. ఆచితూచి ఆడితే ఈ పిచ్‌లపై కూడా పరుగులు రాబట్టచ్చని కోహ్లికి సూచించాడు.

స్పిన్‌, బ్యాటింగే టీమిండియా బలం
టీమిండియా బలం బ్యాటింగేనని, స్పిన్‌ బౌలింగ్‌ అదనపు బలమని మెక్‌గ్రాత్‌ తెలిపాడు. పేస్‌ బౌలర్లు కూడా నిలకడగా రాణిస్తున్నారన్నారు. ఇషాంత్‌ శర్మ అనుభవం ఈ సిరీస్‌లో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. బుమ్రా, భువనేశ్వర్‌ లేకపోవడంతో పేస్‌ బౌలింగ్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని మెక్‌గ్రాత్‌ తెలిపాడు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement