కుర్రాళ్లూ... కొట్టేయండి! | Sakshi
Sakshi News home page

కుర్రాళ్లూ... కొట్టేయండి!

Published Wed, Jan 27 2016 12:36 AM

కుర్రాళ్లూ... కొట్టేయండి!

నేటి నుంచి అండర్-19 ప్రపంచకప్
* ఫేవరెట్‌గా భారత్

ఢాకా: ఓవైపు ఉరకలెత్తే ఉత్సాహం... మరోవైపు గెలవాలన్న కసి... వెరసి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కుర్రాళ్ల క్రికెట్ పండగకు బంగ్లాదేశ్‌లో రంగం సిద్ధమైంది. నేటి నుంచి బంగ్లాదేశ్‌లో అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి తలపడుతున్నాయి. ఫిబ్రవరి 14 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న మాజీ చాంపియన్ భారత్... గ్రూప్ ‘డి’లో ఐర్లాండ్, నేపాల్, న్యూజిలాండ్‌లను ఎదుర్కొంటుంది. గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్, ఫిజి, వెస్టిండీస్, జింబాబ్వే; గ్రూప్ ‘బి’లో అఫ్ఘానిస్తాన్, కెనడా, పాకిస్తాన్, శ్రీలంక; గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య బంగ్లాదేశ్, నమీబియా, డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్ ఉన్నాయి. భద్రతాకారణాలరీత్యా ఆస్ట్రేలియా జట్టు ఈ మెగా ఈవెంట్ నుంచి వైదొలిగింది. తొలి రోజున బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా; ఫిజీతో ఇంగ్లండ్ ఆడనున్నాయి.
 
భారత్ తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో
వార్మప్ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన భారత్ ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న యువ భారత్ జట్టుకు ఇషాన్ కిషన్ నాయకత్వం వహిస్తున్నాడు. అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోన్న భారత్ గురువారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడుతుంది. ఆల్‌రౌండర్లతో పాటు నాణ్యమైన పేస్, స్పిన్ బౌలింగ్ భారత్ సొంతం. అలాగే మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ వ్యూహాలు కూడా కీలకంకానున్నాయి. గతంలో భారత జట్టు 2000లో, 2008లో, 2012లో అండర్-19 ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.

Advertisement
Advertisement