చిత్తుగా ఓడిన గంభీర్ సేన! | Sakshi
Sakshi News home page

చిత్తుగా ఓడిన గంభీర్ సేన!

Published Mon, Dec 28 2015 9:44 PM

Vijay Hazare Trophy, Final Gujarat won over delhi

బెంగళూరు: విజయ్ హజారే వన్డే ట్రోఫీ ఫైనల్‌ పోరులో గౌతం గంభీర్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు చిత్తుగా ఓడింది.  గుజరాత్ జట్టు విసిరిన 274 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. కేవలం 134 పరుగులకే ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్‌ కుప్పకూలింది. పవన్ నేగి 57 పరుగులతో రాణించగా.. ఉన్ముక్‌ చంద్‌ 33 పరుగులు చేశాడు. ఢిల్లీ జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్లు డకౌటయ్యారంటే గుజరాత్ బౌలర్లు ఏమేరకు చెలరేగిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ ఓపెనర్లు రిషబ్ పాంట్(0), శిఖర్ ధవన్(5), కెప్టెన్ గౌతం గంభీర్(9) వరుసగా పెవిలియన్ కు చేరారు. గుజరాత్ బౌలర్లలో ఆర్పీ సింగ్ నాలుగు వికెట్లు సాధించగా, భుమ్రాహ్ కు ఐదు వికెట్లు దక్కాయి.

అంతకుముందు గుజరాత్ కెప్టెన్ పార్థీవ్ పటేల్ సెంచరీతో అదరగొట్టి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. కీలక మ్యాచ్ లో పార్థీవ్ పటేల్(105;119 బంతుల్లో 10 ఫోర్లు) దుమ్మురేపాడు. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ .. గుజరాత్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది.  దీంతో బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్  ఆదిలోనే  ప్రియాంక్ పంచాల్(14) వికెట్ ను కోల్పోయింది. అనంతరం భార్గవ్ మెరాయ్(5) కొద్ది వ్యవధిలోనే రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు.
 
ఈ తరుణంలో పార్థీవ్ కు రుజు భట్ జతకలిశాడు. వీరిద్దరూ మంచి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు కదిలించారు.ఈ జోడీ మూడో వికెట్ కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే రిజు భట్(60) హాఫ్ సెంచరీ,  పార్థీవ్ పటేల్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ 193 పరుగుల వద్ద వరుసగా పెవిలియన్ చేరినా.. ఆ తరువాత చిరాగ్ గాంధీ(44 నాటౌట్ ), కలారియా(21) సమయోచితంగా ఆడటంతో గుజరాత్ 273 పరుగులను స్కోరు బోర్డుపై ఉంచింది.

Advertisement
Advertisement