ఏజీ ప్రదీప్ సెంచరీ | Sakshi
Sakshi News home page

ఏజీ ప్రదీప్ సెంచరీ

Published Wed, Dec 16 2015 12:37 AM

Vijay Hazare Trophy round-up: Yuvraj Singh powers Punjab to win, MS Dhoni fails for Jharkhand

న్యూఢిల్లీ: విజయ్ హజారే వన్డే టోర్నీలో ఆంధ్ర జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర 55 పరుగుల తేడాతో ఒడిషాను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఏజీ ప్రదీప్ (123 బంతుల్లో 102 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) తన లిస్ట్-ఎ కెరీర్‌లో రెండో సెంచరీ సాధించాడు. ప్రదీప్‌కు జ్యోతి సాయికృష్ణ (57 బంతుల్లో 72; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అండగా నిలిచాడు.

వీరిద్దరు ధాటిగా ఆడి నాలుగో వికెట్‌కు  18.5 ఓవర్లలోనే 138 పరుగులు జోడించడం విశేషం. అనంతరం ఒడిషా 48 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. అనురాగ్ సారంగి (72 బంతుల్లో 52; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, బిప్లబ్ సమంత్రే (44), బెహెరా (42) రాణించారు. శివకుమార్ 37 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
 
ఆలూరు: గ్రూప్ ‘బి’లో మూడో విజయాన్ని సాధించిన జార్ఖండ్ నాకౌట్ అవకాశాలు మెరుగుపర్చుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ 47 పరుగులతో కర్ణాటకపై విజయం సాధించింది. ముందుగా జగ్గీ (50), దేబబ్రత్ (47 నాటౌట్), సౌరభ్ తివారి (43) రాణించడంతో జార్ఖండ్ 8 వికెట్లకు 216 పరుగులు చేసింది. బ్యాటింగ్ ఫామ్ కోసం ప్రయత్నిస్తున్న ధోని (1) మూడో స్థానంలో వచ్చి మళ్లీ విఫలమయ్యాడు.

Advertisement
Advertisement