సిరీస్‌ పోయినా.. ర్యాంక్‌ పదిలమే | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 12 2018 1:46 PM

Virat Kohli And Gang Continues To Dominate ICC Test Rankings - Sakshi

దుబాయ్‌: ఇంగ్లడ్‌పై టెస్టు సిరీస్‌ను చేజార్చుకున్నప్పటికీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్‌ వన్‌ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. కానీ పది పాయింట్లు కోల్పోయి 115 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌లోనే ఉంది. టెస్టు సిరీస్‌లో ఓడిన నాలుగు మ్యాచ్‌లు స్వల్ప తేడాతోనే ఓడిపోవడంతో కోహ్లి సేన ఆగ్రస్థానాన్ని కాపాడుకుంది. టీమిండియాపై టెస్టు సిరీస్‌ రూపంలో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న ఇంగ్లండ్‌ 105 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. సిరీస్‌కు ముందు 97 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ జట్టు అంచనాలకు మించి ఆడటంతో న్యూజిలాండ్‌ జట్టును వెనక్కి నెట్టింది. ఇక ఈ జాబితాలో దక్షిణాఫ్రికా 106 పాయింట్లతో రెండో స్ధానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా(106), న్యూజిలాండ్‌(102), శ్రీలంక(97), పాకిస్తాన్‌(88)జట్లు ఉన్నాయి.

ఇక ఆటగాళ్ల ర్యాంకింగ్‌ విషయానికొస్తే..
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ పరుగుల వరద పారించిన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి 930 పాయింట్లతో నంబర్‌ వన్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌(929), కివీస్‌ సారథి విలియమ్సన్(847)‌, బ్రిటీష్‌ టెస్టు కెప్టెన్‌ జోయ్‌ రూట్‌(835)లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ చటేశ్వర పుజారా ఆరో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇక ఐదో టెస్టులో మెరుపు శతకంతో ఆకట్టుకున్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ టాప్‌ 20లోకి ప్రవేశించాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియాతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో అసాధారణ రీతిలో బౌలింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ ఆగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తొలి నాలుగు టెస్టులకు రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైన రవీంద్ర జడేజా ఒక ర్యాంక్‌ చేజార్చుకొని నాలుగో స్థానానికి పడిపోయాడు. మరో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.      
 

Advertisement
Advertisement