వారెవ్వా కోహ్లి | Sakshi
Sakshi News home page

వారెవ్వా కోహ్లి

Published Sat, Dec 2 2017 2:53 PM

virat kohli gets another century in srilanka test series - Sakshi

ఢిల్లీ: శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో సెంచరీ సాధించాడు. ఇప్పటికే వరుస రెండు టెస్టుల్లో సెంచరీలు సాధించిన కోహ్లి.. చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సైతం శతకంతో అదరగొట్టాడు.  110 బంతుల్లో  14 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకుని శభాష్‌ అనిపించాడు. తద్వారా రెండు సందర్బాల్లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో కోహ్లి (తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో104 నాటౌట్‌, రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 213పరుగులు) రెండు శతకాలు సాధించిన సంగతి తెలిసిందే. గతంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా కోహ్లి వరుసగా మూడు శతకాలు సాధించాడు.

అతనికి జతగా ఓపెనర్‌ మురళీ విజయ్‌ కూడా సెంచరీ సాధించడంతో భారత్‌ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. 163 బంతుల్లో 9 తొమ్మిది ఫోర్లతో మురళీ విజయ్‌ శతకం చేశాడు. ఇది విజయ్‌కు 11వ టెస్టు సెంచరీ కాగా వరుసగా రెండో సెంచరీ. లంకేయులతో రెండో టెస్టులో విజయ్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. దాంతో భారత ఇన్నింగ్స్‌ను శిఖర్‌ ధావన్‌-మురళీ విజయ్‌లు ఆరంభించారు. అయితే ధావన్‌(23) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై చతేశ్వర పుజారా(23) రెండో వికెట్‌గా అవుటయ్యాడు.  ఆ తరుణంలో మురళీ విజయ్‌కు జతకలిసిన కోహ్లి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ శ్రీలంక బౌలర్లకు పరీక్షగా నిలుస్తూ దుమ‍్మురేపారు. ముందుగా విజయ్‌ సెంచరీ చేయగా, కాసేపటికి కోహ్లి శతకం సాధించాడు. ఇది కోహ్లి టెస్టు కెరీర్‌లో 20వ శతకం కాగా, ఈ ఏడాది ఐదో సెంచరీ. అయితే సొంతమైదానంలో విరాట్‌కు ఇది తొలి టెస్టు సెంచరీ కావడం ఇక్కడ మరో విశేషం. కోహ్లి-మురళీ విజయ్‌లు రాణించడంతో 64 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసిన భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement