కోహ్లికి మిథాలీ తెలియదేమో! | Sakshi
Sakshi News home page

కోహ్లికి మిథాలీ తెలియదేమో!

Published Thu, Jul 13 2017 1:02 PM

కోహ్లికి మిథాలీ తెలియదేమో!

న్యూఢిల్లీ:భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డే ఫార్మాట్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. మహిళా వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా మిథాలీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.  వన్డే ప్రపంచకప్లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా అత్యధిక పరుగుల రికార్డును మిథాలీ సొంతం చేసుకున్నారు.  ఈ క్రమంలోనే చార్లోటి ఎడ్వర్డ్స్‌ (ఇంగ్లండ్‌) పేరిట ఇంత కాలం ఉన్న 5,992 పరుగుల రికార్డును మిథాలీ బద్దలు కొట్టారు. మరొకవైపు వన్డేల్లో ఆరువేల పరుగుల్ని సాధించిన తొలి మహిళా క్రికెటర్గా సైతం మిథాలీ చరిత్ర పుస్తకాల్లో నిలిచారు.

దాంతో మిథాలీ రాజ్పై ప్రశంలస వర్షం కురిసింది. పలువురు క్రికెట్ సూపర్ స్టార్లు ఆమెను కొనియాడారు. అయితే భారత పురుష క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా మిథాలీని పొగడ్తలతో ముంచెత్తాడు. భారత్ క్రికెట్ కు ఇదొక మంచి పరిణామం అంటూ మిథాలీని  కోహ్లి ప్రశంసించాడు. అయితే తన ఫేస్ బుక్ లో మిథాలీని ప్రశంసిస్తూ కోహ్లి పోస్ట్ చేసిన ఫోటోపై విమర్శల వర్షం కురిసింది. మిథాలీని ప్రశంసించే క్రమంలో మరో మహిళా క్రికెటర్ పూనమ్ రౌత్ ఫోటోను కోహ్లి పోస్ట్ చేయడం విమర్శలకు కారణమైంది. కోహ్లి చేసిన తప్పిదంపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడ్డారు. కోహ్లికి మిథాలీ తెలియదేమో అంటూ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ ఫేస్ బుక్ కామెంట్ ను, ఫోటోను కోహ్లి డిలీట్ చేశాడు. ప్రస్తుతం  కోహ్లి న్యూయార్క్ హాలీడే ట్రిప్లో ఉన్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement