న్యూఢిల్లీ:భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు. ఈ ఏడాది విశేషంగా రాణించిన కోహ్లికి పురుషుల కేటగిరీలో ఈ అవార్డు దక్కగా.. మహిళా కేటగిరీలో ఇచ్చే బెస్ట్ వుమెన్స్ అవార్డును మిథాలీ రాజ్ గెలుచుకుంది. 2014-15 గాను మెన్స్, వుమెన్స్ క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా బీసీసీఐ తమ వార్షిక అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులను జనవరి 5 వ తేదీన ముంబైలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.
ఈ సంవత్సరం కోహ్లి అటు టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ భారత తరపున ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. 15 టెస్టుల్లో 42.67 సగటుతో 640 పరుగులు చేయగా, 20 వన్డేల్లో 36.65 సగటుతో 623 పరుగులు చేశాడు. దీంతో కోహ్లీ రెండోసారి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు. అంతకుముందు 2011-12 సంవత్సరానికి గాను తొలిసారి విరాట్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఏడాది కోహ్లీ నేతృత్వంలో టీమిండియా మరపురాని విజయాలను సాధించింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ను గెలిచిన భారత్.. దక్షిణాఫ్రికాకు విదేశాల్లో ఉన్న తొమ్మిదేళ్ల ఘనమైన రికార్డుకు ఫుల్ స్టాప్ పెట్టింది. అంతకుముందు శ్రీలంకను వారి గడ్డపైనే ఓడించి రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించిండం విశేషం.
ఇదిలా ఉండగా బెస్ట్ వుమెన్స్ (ఎంఎ చిదంబరం ట్రోఫీ) అవార్డును గెలుచుకున్న మిథాలీ రాజ్.. మొత్తంగా 158 వన్డేలు ఆడి 5,029 పరుగులు చేసింది. దీంతో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ గా మిథాలీ అరుదైన ఘనతను సాధించగా.. ఓవరాల్ గా రెండో మహిళా క్రికెటర్ గా గుర్తింపు పొందింది. మరోవైపు కర్ణాటకు క్రికెట్ అసోసియేన్ ఇచ్చే స్టేట్ అసోసియేషన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప ఎంపికయ్యాడు. రంజీల్లో అద్భుత ప్రతిభ ఆధారంగా రాబిన్ కు ఈ అవార్డు దక్కింది. ఈ ఏడాది 11 రంజీ మ్యాచ్ లు ఆడిన రాబిన్ ఊతప్ప 50.66 సగటుతో 912 పరుగులు నమోదు చేశాడు.