న్యూఢిల్లీ: ట్వంటీ-20 వరల్డ్ కప్ కు రంగం సిద్ధమైంది. ఈ నెల 16వ తేదీ నుంచి బంగ్లాదేశ్ లో ఆరంభకానున్న పొట్టి వరల్డ్ కప్ కు భారత్ ఆటగాళ్లు సమాయత్తమవుతున్నారు. మార్చి 21 వతేదీన టీం ఇండియా తన తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ తో తలపడునుంది. ఆసియాకప్ లో ఘోరంగా దెబ్బతిన్న టీం ఇండియా ఈ వరల్డ్ కప్ లో తిరిగి రాణిస్తుందని కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన విరాట్ కోహ్లి తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇదే వేదికపై ఘోర పరాభవం చవిచూసిన టీం ఇండియాకు ఇక్కడ పరిస్థితులు లాభిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆసియాకప్ అనంతరం ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి లభించిందని తెలిపాడు.
ఆసియాకప్ లో బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్ జట్లుపై మాత్రమే రాణించిన భారత్ లీగ్ దశ నుంచే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. 2007వ సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో జరిగిన ట్వంటీ-20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్న భారత్ .. ఈ టోర్నీలో ఏ మేరకు రాణిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.