భయంతో వణికిపోయా: విరాట్ కోహ్లి | Sakshi
Sakshi News home page

భయంతో వణికిపోయా: విరాట్ కోహ్లి

Published Mon, May 7 2018 3:20 PM

Virat Kohli Reveals His Feeling When He Selected To Team India - Sakshi

బెంగళూరు: ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి స్థానం ఉంటుంది. అయితే ఓ కీలక సందర్భంలో తనకు వణుకు పుట్టిందంటూ క్రికెట్‌లో తొలి అనుభవాలను ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు. ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘జాతీయ జట్టులోకి విరాట్ కోహ్లి ఎంపికయ్యాడంటూ 2008లో ఓ టీవీ వార్తల్లో చూశా. సరిగ్గా ఆ సమయంలో అమ్మ నా పక్కనే ఉన్నారు. అవన్నీ వదంతులు అయి ఉంటాయని అమ్మతో చర్చించా. నిమిషాల వ్యవధిలో నాకు బీసీసీఐ నుంచి ఫోన్ వచ్చింది. జాతీయ జట్టులోకి తీసుకున్నామని చెప్పగానే.. ఆ నిజాన్ని జీర్ణించుకునే క్రమంలో భయంతో వణికిపోయానంటూ’ కోహ్లి వివరించాడు. 

జట్టులోకి సెలక్ట్ అయ్యాక తొలిసారి డ్రెస్సింగ్ రూములో మీటింగ్ జరిగింది. మాట్లాడాల్సిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చారు. కానీ గొప్ప క్రికెటర్ల ముందు మాట్లాడేందుకు ఎంతో ఒత్తిడికి లోనయ్యాను. ప్రస్తుతం కొత్త కుర్రాళ్లు జట్టులోకి వచ్చినప్పుడు అదే తీరుగా మేం వారిని డ్రెస్సింగ్ రూములో భయపెడుతుంటాం(నవ్వుతూ). ఇవే భారత క్రికెట్ జట్టులోకి ఎంపికైనప్పుడు నా తొలి అనుభూతులంటూ కోహ్లి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

ఒకవేళ తాను క్రికెట్ లేదా ఏదైనా ఆట ఆడకపోయి ఉంటే మాత్రం కచ్చితంగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేవాడిని కాదన్నాడు కోహ్లి. ఆటగాడికి ఫిట్‌నెస్ అదనపు బలమని తాను భావిస్తానన్నాడు. కోహ్లి 2008లో టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేయగా, 2010లో తొలి  టీ20 మ్యాచ్‌ ఆడాడు. 2011లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Advertisement
Advertisement