అడిలైడ్: టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై భారత్ కు మంచి రికార్డు ఉన్నా.. ఈ రోజు వరకూ ఏ ఒక్క భారత్ ఆటగాడు పాక్ పై సెంచరీ నెలకొల్పలేదు. అయితే ఆదివారం పాకిస్తాన్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో విరాట్ ఆ ఘనతను సాధించి టీమిండియా కీర్తిని మరోసారి పెంచాడు. తాజాగా విరాట్ వన్డేల్లో 22 వ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. నేటి మ్యాచ్ లో రెండు లైఫ్ లతో గట్టెక్కిన విరాట్.. టీమిండియా మూడొందల మార్క్ చేరడంలో సహకరించాడు. అంతకుముందు సచిన్ 20 సెంచరీల రికార్డును విరాట్ అతి తక్కువ మ్యాచ్ ల్లో అధిగమించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా అడిలైడ్ లో సెంచరీ చేసిన మూడో భారత క్రికెటర్ గా కోహ్లీ రికార్డులుకెక్కాడు. సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లు ఇదే వేదికపై సెంచరీలు నెలకొల్పారు.