ఐపీఎల్‌కూ గుడ్‌బై... | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌కూ గుడ్‌బై...

Published Wed, Oct 21 2015 2:52 AM

ఐపీఎల్‌కూ గుడ్‌బై...

అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు లీగ్ నుంచీ తప్పుకున్న సెహ్వాగ్
న్యూఢిల్లీ: భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. అయితే ముందుగా హర్యానా క్రికెట్ సంఘానికి ఇచ్చిన మాట ప్రకారం ఈ సీజన్‌లో రంజీ మ్యాచ్‌లు మాత్రం ఆడతాడు. ఆ తర్వాత మాజీ క్రికెటర్లు ఆడే మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసీఎల్) లో బరిలోకి దిగుతాడు. వాస్తవానికి సోమవారం దుబాయ్‌లో జరిగిన ఎంసీఎల్ కార్యక్రమంలోనే వీరూ తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.

అయితే ఈ విషయంలో పూర్తి స్పష్టత లేకపోవడంతో... మంగళవారం అధికారికంగా ఓ వీడియో ప్రకటన విడుదల చేశాడు. మంగళవారం నాడు కుటుంబసభ్యులతో కలిసి 37వ పుట్టిన రోజు జరుపుకుంటూ రిటైర్‌మెంట్ ప్రకటన చేశాడు. వీరూ ప్రకటన అతని మాటల్లోనే...
 
‘నేనెప్పుడూ ఏది కరెక్ట్ అనుకుంటానో అదే చేస్తాను. దేవుడి దయవల్ల నేను సాధించాలనకున్నవి చాలా సాధించాను. నా 37వ పుట్టినరోజు రిటైర్ కావాలని చాలా కాలం క్రితమే నిర్ణయించుకున్నాను. అంతర్జాతీయ క్రికెట్ నుంచి, ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవుతున్నాను. క్రికెట్ నా జీవితం. భారత్ తరఫున ఆడటం మరచిపోలేని ప్రయాణం. నా సహచరులకు, అభిమానులకు మంచి జ్ఞాపకాలను అందించడంలో నేను విజయం సాధించాననే అనుకుంటున్నాను. చాలా సంవత్సరాలుగా నాతో కలిసి ఆడిన ఆటగాళ్లలో ఎందరో దిగ్గజాలు ఉన్నారు. వాళ్లందరితో పాటు భారత క్రికెట్ అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

నా మీద మీరు చూపించిన ప్రేమ, అందించిన మద్దతు, జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి. నా సుదీర్ఘ కెరీర్‌లో ఎంతోమంది గొప్ప ప్రత్యర్థులతో ఆడగలిగాను. ప్రపంచంలో ఎన్నో గొప్ప మైదానాల్లో నా సామర్ధ్యాన్ని నిరూపించుకునే అవకాశం రావడం నా అదృష్టం. సచిన్, గవాస్కర్, కపిల్ నా రోల్ మోడల్స్. వారి ఆటను చూస్తూ పెరిగా, వారి దగ్గరి నుంచి చాలా నేర్చుకున్నా. పాజిటివ్ దృక్పథం కారణంగానే నేను పరుగులు చేయగలిగాను. తొలి ట్రిపుల్ సెంచరీ, వన్డే ప్రపంచకప్ గెలవడం మరచిపోలేని జ్ఞాపకాలు.

నాలో టెస్టు ఆటగాడు ఉన్నాడని గుర్తించింది గంగూలీ. తను నా కోసం వన్డే ఓపెనర్ స్థానాన్ని త్యాగం చేశాడు. ఎంతో నమ్మకం ఉంచాడు. తను చేసిన మేలును ఎప్పటికీ మరచిపోలేను. నా సుదీర్ఘ కెరీర్‌లో మురళీధరన్ బౌలింగ్ అంటే భయపడేవాడిని. నా క్రికెట్ ప్రయాణం ప్రారంభమైనప్పుడు మా నాన్న ఉన్నారు. రిటైర్ అవుతున్న రోజు కూడా ఆయన ఉంటే బాగుండేది. ఆయన ఏ లోకంలో ఉన్నా నన్ను చూసి గర్వపడుతున్నారనే అనుకుంటున్నా. నేను ఓ మంచి ఆటగాడిగా ఎదగడానికి కారకులైన కోచ్ ఎ.ఎన్.శర్మగారు.

ఆయన వల్లే నేను ఎదిగాను. మా అమ్మ, నా భార్య, పిల్లలు నా బలం. ఢిల్లీ క్రికెట్ సంఘం, బీసీసీఐ మద్దతును ఎప్పటికీ మరవలేను. ఏ స్థాయి క్రికెట్‌లో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించినా నా అత్యుత్తమ క్రికెట్ ఆడాను. ఇకపై జజ్జర్‌లోని సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఎక్కువ సమయం గడుపుతా.  ఏదో ఒక రూపంలో ఆటతో నా అనుబంధం కొనసాగుతుంది. కామెంటేటర్‌గా లేదా కోచ్‌గా ఏదో ఒక రూపంలో మళ్లీ కనిపిస్తా. ఎందుకంటే క్రికెట్ లేకుండా నేను ఉండలేను.’
 
థాంక్యూ వీరూ...
ఏంటీ షాక్... మనసు జీర్ణించుకోలేకపోతోంది. సెహ్వాగ్ ఆటను ఇక చూడలేమా..? అంతర్జాతీయ క్రికెట్‌లో సరే. ఐపీఎల్‌లోనూ అతను ఆడటం లేదా..? ఎందుకీ కఠిన నిర్ణయం. ఏం వయసైపోయిందని అప్పుడే రిటైరవుతున్నాడు..! తొలి ఓవర్లోనే అలా బంతులు ఎగిరి స్టాండ్‌లో పడుతుంటే మేం తీన్‌మార్ వేయడం ఇష్టం లేదేమో..! జిడ్డురా బాబూ అంటూ టెస్టులకు రాని స్నేహితులు, వీరూ ఉన్నాడురా అంటే ఉరుకుతూ వచ్చేవాళ్లు.  
 
పొగరుగా ఎగిరే షోయబ్ అక్తర్ బంతిని అలవోకగా సిక్సర్ బాదుతుంటే... ఎవరినైనా భయపెట్టే బ్రెట్‌లీ బౌన్సర్‌ని స్టాండ్స్‌లోకి పంపిస్తుంటే...  స్టెయిన్ బుల్లెట్ బంతులు కూడా బౌండరీలు దాటుతుంటే... బంతిని ఎలా తిప్పుతాడో తెలియని వార్న్ కూడా తలపట్టుకుంటే... దానర్థం ఒక్కటే. అక్కడ సెహ్వాగ్ ఆడుతున్నాడని.
 
1999లో సెహ్వాగ్ జట్టులోకి వచ్చినా రెండేళ్ల పాటు సాధారణ క్రికెటర్లలో ఒకడు మాత్రమే. 2001లో కొలంబోలో న్యూజిలాండ్‌పై 69 బంతుల్లోనే సెంచరీ బాదినప్పుడు తొలిసారి అనిపించింది... ఆహా... ఏం ఆటగాడు దొరికాడురా అని. అప్పటి నుంచి 12 ఏళ్ల పాటు భారత అభిమాని ఎప్పుడూ వినోదం కోసం వెతుక్కోవాల్సిన అవసరం రాలేదు. సచిన్ లాంటి దిగ్గజంతో సరిసమానంగా షాట్లు ఆడాలంటే ఎంత గొప్ప ఆటగాడై ఉండాలి. ప్రత్యర్థులు 300 లక్ష్యాన్ని ఎదురుగా ఉంచినా... వీరూ పది ఓవర్లు ఉంటే చాలురా బాబూ అనుకునేవాళ్లం. ఎదురుగా ఎంత గొప్ప బౌలర్ ఉన్నా అదురూ బెదురూ లేదు. బ్యాటింగ్ చేయడం క్లిష్టంగా ఉన్న పిచ్‌పై కూడా పునరాలోచన లేదు. బాదడం ఒక్కటే తెలుసు. ఉన్నంతసేపు దడదడలాడిస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించడమే తెలుసు.
 
95 పరుగుల మీద ఒక్క బంతి కూడా వృథా చేయకుండా సిక్సర్ కొట్టాలంటే ఎంత ధైర్యం కావాలి. టెస్టు మ్యాచ్‌లో 294 పరుగుల దగ్గర స్పిన్నర్ బౌలింగ్‌లో ముందుకు రావాలంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి. అందుకే.. వీరూలాంటి విధ్వంసం మరెవరికీ సాధ్యం కాదు. గత దశాబ్ద కాలంలో... ఆ మాటకొస్తే క్రికెట్‌లోనే అత్యంత విధ్వంసకర ఓపెనర్ సెహ్వాగ్. తను రిటైరైతే క్రికెట్ ప్రపంచం రిచర్డ్స్‌ను గుర్తుకు తెచ్చుకుంటోంది. ఈ ఒక్క పోలిక చాలు తను అభిమానులు, సహచరుల గుండెల్లో ఎలాంటి స్థానం సంపాదించుకున్నాడో చెప్పడానికి.
 
నిజానికి సెహ్వాగ్ భారత్ తరఫున ఆడి రెండేళ్లు దాటిపోయింది. అయినా అభిమానులు తనని మరచిపోలేదు. ఐపీఎల్‌లో ఈ రెండేళ్లూ పంజాబ్ ఆడిన మ్యాచ్‌లను విరగబడి చూశారు. అక్కడ వీరూ విధ్వంసాన్ని చూసుకుని మురిసిపోయారు. ఇకపై అదీ చూసే అవకాశం లేదని తలచుకుంటేనే అదోలా  ఉంది. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన రోజు భారత అభిమాని ఏం కోల్పోయాడని భావించాడో... ఇప్పుడు వీరూ ఇక ఆడడని తెలిసినా అదే బాధను అనుభవిస్తున్నాడు. ఆటపై తను వేసిన ముద్ర అలాంటిది. సచిన్‌లాంటి దిగ్గజం చాటున కూడా తన ప్రతిభతో, విధ్వంసంతో చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు.

టెస్టుల్లో అనేక మంది భారత దిగ్గజాలకు సాధ్యం కాని ట్రిపుల్ సెంచరీ ఘనతను రెండుసార్లు సాధించాడు. నిజానికి గత ఏడాది డిసెంబరులోనే... రిటైర్‌మెంట్ గురించి చిన్న హింట్ ఇచ్చాడు. ‘నేను సాధించాల్సింది ఏమీ లేదు. అనుకున్నదానికంటే ఎక్కువ ఘనతలు సొంతం చేసుకున్నాను. ఇక ఆటను ఆస్వాదించడానికి మాత్రమే ఆడుతున్నాను’ అనే మాటతో తిరిగి భారత జట్టులోకి రావడానికి ప్రత్యేక ప్రయత్నాలు లేవని అర్థమైంది.
 
వీరూ భారత జట్టుకు దూరమవడానికి కారణాలు ఏమైనా కావచ్చు. ఆ చర్చ జోలికి ఇప్పుడు వెళ్లడం అనవసరం. కానీ ఇంత గొప్ప క్రికెటర్ ఇలా సాధారణంగా రిటైర్ కావడం మాత్రం బాధ కలిగించే అంశం. భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకడికి ఓ గౌరవప్రదమైన వీడ్కోలు దొరికి ఉంటే బాగుండేది. ఇందుకు భారత క్రికెట్ వీరూకు సారీ చెప్పాలి. ఏమైనా.. దశాబ్దంపాటు అందులేని వినోదాన్ని అందించినందుకు థాంక్స్ చెప్పి తీరాలి.
- సాక్షి క్రీడావిభాగం
 
మాటల్లోనూ ఘనాపాటి!
* ఈతరం క్రికెటర్లలో సెహ్వాగ్ తరహాలో కుండబద్దలు కొట్టినట్లు ఎవరూ మాట్లాడలేరు. బ్యాటింగ్‌తోనే కాదు మాట లతో కూడా ‘పంచ్’లు విసిరే అతని వ్యాఖ్యల్లో కొన్ని...
* ‘బ్యాంక్ బ్యాలెన్స్ (సచిన్‌కు తనకు తేడా ఏమిటనే ప్రశ్నకు)
* ‘బంతి విసురుతున్నాడా...బిచ్చం అడుగుతున్నాడా...(తన బౌలింగ్‌లో హుక్ చేయమంటూ పదే పదే రెచ్చగొట్టిన అక్తర్ గురించి)
* ‘ఆయన రోజంతా ఆడి ఒకే ఒక్క ఫోర్ కొట్టిన విషయం మరచిపోయాడా (ప్రతిభ ఉన్నా బుర్ర లేదంటూ తనపై వ్యాఖ్య చేసిన బాయ్‌కాట్ గురించి)
* ‘ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే రెండు ట్రిపుల్ సెంచరీలు చేసి మరొకటి కొద్దిలో మిస్ అయ్యారు. అస్సలు నిరాశ లేదు’ (ముంబైలో 293 తర్వాత)
* ‘94 మీద ఉన్నావు. సిక్సర్ కొట్టి సెంచరీ చేయవచ్చుగా’ (లక్ష్మణ్‌కు క్రీజ్‌లో రన్నర్‌గా వచ్చి సలహా)
 
ప్రశంసల వెల్లువ
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కు క్రికెట్ ప్రపంచంతో పాటు                               పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు కావలసిన వినోదాన్ని సెహ్వాగ్ అందించాడు. ఎంతోమంది యువ క్రికెటర్లలో స్ఫూర్తిని నింపాడు. అతని భవిష్యత్తు బాగుండాలి’         -శశాంక్ మనోహర్
 
సెహ్వాగ్‌కు నా అభినందనలు. దేశానికి ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. భారత క్రికెట్‌కు తను రిచర్డ్స్. దిగ్గజాల్లో ఒకడిగా ఆటకు వీడ్కోలు చెబుతున్నాడు. అంకితభావం ఉంటే ఎలా ఎదగొచ్చో వీరూను చూసి నేటి తరం క్రికెటర్లు నేర్చుకోవాలి’     - అనురాగ్ ఠాకూర్
 
రిచర్డ్స్ బ్యాటింగ్‌ను నేను ప్రత్యక్షంగా చూడలేదు. కానీ ప్రపంచంలోని ఉత్తమ బౌలర్లను సెహ్వాగ్ బాదడం కళ్లారా చూశాను. వీరూలాంటి మైండ్‌సెట్ ఉన్న ఆటగాడిని చూడలేం. మిగిలిన ఆటగాళ్లు సింగిల్ కోసం ఆడే చోట వీరూ బౌండరీ కోసం ప్రయత్నిస్తాడు’      -ధోని
 
వీరూ భాయ్ నీతో కలిసి ఆడగలగడం నా అదృష్టం. నీది అద్భుతమైన కెరీర్. నీ మార్గదర్శకత్వానికి, నువ్విచ్చిన జ్ఞాపకాలకు కృతజ్ఞతలు. ఆధునిక క్రికెట్‌లో నువ్వు దిగ్గజం’     -కోహ్లి
 
శుభాకాంక్షలు వీరూ. నువ్వు అద్భుతమైన వినోదాన్ని అందించావు. ఎన్నో గొప్ప జ్ఞాపకాలను అందించినందుకు కృతజ్ఞతలు       -లక్ష్మణ్
 
ఆటలోనూ, జీవితంలోనూ సెహ్వాగ్ దృక్పథం అంటే నాకు చాలా ఇష్టం. తను ఆడిన ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌ను రెండో ఎండ్‌లో నిలబడి చూశాను. మనందరిలో ఇంకా సంతోషాన్ని, నవ్వులను వీరూ తెస్తాడు. తన ప్రదర్శనలతో ఆటపై తన ముద్రను వేసి వెళుతున్నాడు’     -సచిన్
 
టాపార్డర్‌లో సెహ్వాగ్‌లా బ్యాటింగ్ చేసే క్రికెటర్ మరొకరు లేరు. జట్టు కోసం ఎప్పుడూ కష్టపడేవాడు. తన రెండో ఇన్నింగ్స్ కూడా సంతోషంగా సాగాలి’     -కుంబ్లే

Advertisement
Advertisement