Sakshi News home page

వార్నర్ ఒంటరి పోరు

Published Mon, Apr 17 2017 9:50 PM

వార్నర్ ఒంటరి పోరు

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ సోమవారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టులో కెప్టెన్ డేవిడ్ వార్నర్(70 నాటౌట్;54 బంతుల్లో7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు.  ఓపెనర్ గా వచ్చిన వార్నర్ కడవరకూ క్రీజ్ లో ఉండి ఒంటరి పోరాటం చేశాడు. ఆ తరువాత నమాన్ ఓజా(34;20 బంతుల్లో2 ఫోర్లు, 1 సిక్స్) కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇక మిగతా వారు విఫలం కావడంతో సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.


గత రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలై తీవ్ర ఒత్తిడిలో ఉన్న సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ఆరంభించింది. శిఖర్ ధావన్, వార్నర్ లు నిలకడగా ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. అయితే ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ను అందుకున్న కింగ్స్ బౌలర్ మోహిత్ శర్మ హైదరాబాద్ కు షాకిచ్చాడు. ఓ చక్కటి బౌన్సర్ తో శిఖర్(15) ను బోల్తా కొట్టించాడు. లెగ్ స్టంప్ వైపు వచ్చిన ఆ బౌన్సర్ ను శిఖర్ హుక్ చేయబోయి సాహాకు దొరికేశాడు. దాంతో 25 పరుగుల వద్ద హైదరాబాద్ తొలి వికెట్ ను కోల్పోయింది. ఆపై హెన్రిక్స్(9), యువరాజ్ సింగ్(0)లు వరుసగా అవుట్ కావడంతో హైదరాబాద్ కష్టాల్లో పడింది. ఆ తరుణంలో నమాన్ ఓజాతో కలిసి వార్నర్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఈ జోడి 60 పరుగుల  జోడించిన తరువాత ఓజా నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. ఇక ఆపై వార్నర్ కు సహకారం లభించకపోవడంతో హైదరాబాద్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. కింగ్స్ బౌలర్లలో మోహిత్ శర్మ,అక్షర్ పటేల్ లు తలో రెండు వికెట్లు సాధించగా, సందీప్ శర్మ,కరియప్పలకు చెరో వికెట్ దక్కింది.

Advertisement
Advertisement