సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టు చేశారు | Sakshi
Sakshi News home page

సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టు చేశారు

Published Wed, Dec 11 2013 11:51 PM

16th december  gangrape case: Convicts claim their arrest was without evidence

 న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన డిసెంబర్ 16 నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించిన నలుగురిలో ఇద్దరు పోలీసులు తమను ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని హైకోర్టులో తెలిపారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దోషులు ముఖేశ్, పవన్‌కుమార్ గుప్తాలు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రేవా ఖేత్రపాల్, జస్టిస్ ప్రతిభారాణిలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దోషుల తరఫు న్యాయవాది ఎంఎల్ శర్మ తన క్లయింట్లను పోలీసులు ఎలాంటి సాక్ష్యాలు లేకుం డానే అరెస్టు చేశారని ధర్మాసనానికి తెలిపారు. కేవలం మీడియా వార్తల ఆధారంగా ముఖేశ్, పవన్ కుమార్ గుప్తాలను పోలీసులు అరెస్టు చేశారని, కీలక ముద్దాయి రాంసింగ్ సోదరుడైన ముఖేశ్‌ను రాజస్థాన్‌లోని ఓ గ్రామం నుంచి సంఘటన జరిగిన మరుసటి రోజు అరెస్టు చేశారని ఆయన ధర్మాసనానికి విన్నవించారు.
 
 పోలీసులు తన కక్షిదారులను హింసించడమే కాకుండా వారికి ఉచిత న్యాయ సహాయం అందించలేదని ఆరోపించారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన తరువాత కూడా నిందితులకు పోలీసులు న్యాయసహాయం ఏర్పాటు చేయలేదన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు.  ఓ బాలుడితో సహా ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు రాంసింగ్ తరువాత తీహార్ జైలులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు’’ అని ధర్మాసనానికి వివరించాడు. సెప్టెంబర్ 13న ఈ కేసులో ట్రయల్ కోర్టు ముఖేశ్, పవన్‌గుప్తా, అక్షయ్, వినయ్‌లకు మరణశిక్ష విధించింది. మరణశిక్షలను ధ్రువీకరించాల్సిందిగా ట్రయల్ కోర్టు కేసును హైకోర్టుకు దాఖలు పర్చింది.

Advertisement
Advertisement