జహీరాబాద్: నిర్మాణంలో ఉన్న ఇంటి పిల్లర్ గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలో శనివారం వెలుగుచూసింది. స్థానిక అల్లీపూర్ గ్రామానికి చెందిన ఈషాన్ ఖాన్(6), అన్సారి(6) స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు. ఇద్దరు చిన్నారులు ఈ నెల 14న ఇంటి నుంచి ఆడుకోవడానికి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో చుట్టుపక్కల వెతికిన కుటుంబ సభ్యులు చిన్నారులు అదృశ్యమయ్యారని పోలీసులుకు ఫిర్యాదు చేశారు.
కాగా.. ఈ రోజు వారి ఇంటి సమీపంలో నిర్మాణంలో ఉన్న పిల్లర్ గుంటలో చిన్నారులు మృతదేహాలు లభ్యమయ్యాయి. భారీ వర్షాలకు పిల్లర్ గుంటలో నీళ్లు నిండటంతో ఆడుకుంటున్న చిన్నారులు అందులో పడి మృతి చెందిఉంటారని స్థానికులు భావిస్తున్నారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.