ఆ మోదీ.. ఈ మోదీ కాదు | Sakshi
Sakshi News home page

ఆ మోదీ.. ఈ మోదీ కాదు

Published Fri, May 6 2016 7:26 PM

ఆ మోదీ.. ఈ మోదీ కాదు - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శల పర్వం కొనసాగిస్తోంది. మోదీ డిగ్రీ పట్టాపై మరోసారి సందేహం వ్యక్తం చేసింది. 1975 నుంచి 80 వరకు ఢిల్లీ యూనివర్శిటీ రికార్డులను పరిశీలించామని, ప్రధానికి బీఏ డిగ్రీ పట్టా అందజేసినట్టు ఎలాంటి ఆధారాలూ లేవని ఆప్ నేతలు వెల్లడించారు. అయితే నరేంద్ర కుమార్ మహావీర్ ప్రసాద్ మోదీ అనే వ్యక్తికి వర్శిటీ అధికారులు డిగ్రీ ప్రదానం చేశారని, ప్రధాని నరేంద్ర దామోదర్దాస్ మోదీకు కాదని చెప్పారు.

'యూనివర్శిటీ రికార్డులను మా స్థాయిలో పరిశీలించాం. డిగ్రీ పట్టా అందుకున్నవారిలో నరేంద్ర దామోదర్దాస్ మోదీ పేరు ఎక్కడా లేదు. 197-78 మధ్య నరేంద్ర కుమార్ మహావీర్ ప్రసాద్ మోదీ అనే వ్యక్తి గ్రాడ్యుయేషన్ చేశారు. ఆయనది రాజస్థాన్లోని అల్వార్' అని ఆప్ నేత ఆశీష్ కేతన్ చెప్పారు. మోదీ విద్యార్హతలను తెలియజేయాల్సిందిగా ఆప్ నేతలు సమాచార హక్కు చట్టం కింద కోరిన సంగతి తెలిసిందే. ఓ పత్రికలో మోదీ డిగ్రీ పట్టాకు సంబంధించి రాసిన వివరాలు, ఢిల్లీ యూనివర్శిటీ రికార్డులతో సరిపోలలేదని చెప్పారు. తమ పరిశీలిన ప్రకారం మోదీ డిగ్రీ నకిలీదని ఆశీష్ కేతన్ ఆరోపించారు. ఇది తీవ్రమైన నేరమని, ఫోర్జరీ లాంటిదని అన్నారు. నకిలీ డిగ్రీ ఆరోపణలపై వైదొలిగిన ఆప్ మాజీ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ కేసు లాంటిదే మోదీ వ్యవహారమని చెప్పారు.

Advertisement
Advertisement