న్యూఢిల్లీ: ‘నా కారు నాకు ఇచ్చేయండి. నేనిచ్చిన విరాళాలనూ వాపస్ చేయండి.. అన్ని పార్టీల్లాగానే ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్)కూడా మారిపోయింది. కేజ్రీవాల్ తీరుతో రాజకీయాలపైనే విశ్వాసం పోయింది.’ ఈ మాటలన్నది ఒక ఆమ్ ఆద్మీ(సామాన్యుడు) అవినీతిపై పోరాటం చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ బృందాన్ని చూసి ప్రేరణ చెంది తన వాగన్ ఆర్ కారును కేజ్రీవాల్కు బహుమతిగా ఇచ్చిన వ్యక్తి. ఉద్యోగ రీత్యా బ్రిటన్కు చెందిన కుందన్ శర్మ 2013లో ఆప్ కన్వీనర్కు తన భార్య శారద పేరుమీద ఉన్న వాగన్ఆర్ కారును బహుమతిగా ఇచ్చాడు. అప్పటి ఎన్నికల ప్రచారం మొత్తం, కేజ్రీవాల్ ఈ కారులోనే చేశారు. 2014 జనవరిలో తొలిసారి సీఎం అయినప్పుడు ప్రభుత్వ కారును వద్దని, ఈ వాగన్ ఆర్ కారులోనే కేజ్రీవాల్ అధికారిక ప్రయాణం చేయటంతో ఈ కారుకు ఎక్కడలేని ఇమేజి వచ్చిపడింది.
రెండోసారి ఢిల్లీ ఎన్నికలు జరిగినప్పుడు కేజ్రీవాల్ ఇన్నోవాలోకి మారిపోయారు. వాగన్ ఆర్ ఏమయిందని విచారిస్తే ఓ పార్టీ అభ్యర్థికి కేజ్రీవాల్ బహుమతిగా ఇచ్చారని తెలిసింది. అయితే, గత రెండు నెలలుగా ఆప్లో నెలకొన్న సంక్షోభం, వ్యవస్థాపక సభ్యులు ప్రశాంత్భూషణ్, యోగేంద్రయాదవ్లను అన్ని కమిటీల నుంచి అవమానకరంగా తప్పించటం, లోక్పాల్ను మాజీ చేయటం వంటి ఘటనలు కుందన్ శర్మను కలచివేశాయి. వాళ్లపై ఆరోపణలు వచ్చినప్పుడు అప్పటి లోక్పాల్తో విచారణ జరిపించకపోవటం సరికాదని కుందన్ ట్వీట్ ద్వారా ప్రశ్నించాడు.