కోలుకునేదెన్నడో? | Sakshi
Sakshi News home page

కోలుకునేదెన్నడో?

Published Sun, Oct 6 2013 2:12 AM

Bhivandi Textile industries have many problems

భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలోని వస్త్ర పరిశ్రమలు పలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. వివిధ కారణాల వల్ల ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. వ్యాపారం ఆశించిన రీతిలో జరగకపోవడం, విద్యు త్ చార్జీలు విపరీతంగా పెరిగిపోవడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. ఇది ఈ రంగంలో ఉన్నవారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ, దసరా, బక్రీద్, దీపావళి తదితర పండుగల సమయంలో పట్టణంలోని దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడతాయి. అయితే ఈ ఏడా ది వాటి వద్ద సందండి అంతంతగానే ఉంది. వస్త్ర తయారీకి ఉపయోగపడే నూలు ధరల హెచ్చుతగ్గుల వల్ల వ్యాపారులకు నష్టం వాటిల్లుతోది. పట్టణవ్యాప్తంగా  అనేక పరిశ్రమలు మూతపడ్డాయి.
 
 మరోవైపు గత నెల నుంచి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసి టీ డిస్ట్రిబ్యూషన్ బోర్డు విద్యుత్ చార్జీలను పెంచిం ది. దీంతో ఏమిచేయాలో పాలుపోని రాష్ట్రం లోని పలు పవర్‌లూమ్ సంఘాలు ఈ నెల ఐదో తేదీన  బోర్డు ప్రతినిధులను కలిశాయి. చార్జీలను పెంచొద్దంటూ విన్నవించాయి. అయినప్పటికీ వారి గోడు ను ఎవరూ ఆలకించలేదు. దీంతో జౌళి శాఖ మాజీ మంత్రి ప్రకాశ్ అవాడే నేతృత్వంలో భివండీ, ఇచల్‌కరంజీ, షోలాపూర్, సాంగ్లీ పట్టణాలకు చెందిన పవర్‌లూమ్ అసోసియేషన్‌లకు చెందిన ప్రతిని ధులు వంగ పురుషోత్తం, సతీశ్ కోస్టి, పెంటప్ప గడ్డం, కొంక మల్లేశం, రాజురాఠి, రాజు పాటిల్ తది తరులు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌లను కలసి విద్యుత్ చార్జీల పెంపువల్ల తమకు ఎదురయ్యే ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన సీఎం... ఈ అంశాన్ని మంత్రిమండలి సమావేశంలో చర్చించి చార్జీలు తగ్గేవిధంగా చూస్తానని హామీ ఇచ్చారు.
 
 ఏడున సమావేశం
 విద్యుత్ చార్జీల పెంపుపై విద్యుత్ గ్రాహక్ సంఘటన్ ఆధ్వర్యంలో ఈ నెల ఏడో తేదీన ప్రత్యేక సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు స్థానిక మీనాతాయి ఠాక్రే హాలులో ఏర్పాటు చేయనున్న ఈ సమావేశంలో భివండీ పవర్‌లూమ్ ఓనర్స్ అండ్ వీవర్స్ అసోసియేషన్, భివండీ పద్మనగర్ పవర్‌లూమ్ అసోసియేషన్, శాంతినగర్ పవర్‌లూమ్ అసోసియేషన్, అల్హారి పవర్‌లూమ్ అసోసి యేషన్, నాలాపార్ పవర్‌లూమ్ అసోసియేషన్, కాడిపార్ పవర్‌లూమ్ అసోసియేషన్‌లకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు.
 
 టోరెంట్ విద్యుత్ వాత
 పట్టణానికి విద్యుత్‌ను సరఫరా చేస్తున్న టోరంట్ పవర్ లిమిటెడ్ కంపెనీ ఈ నెల ఏడో తేదీ నుంచి చార్జీలను పెంచనుంది. ఇదిలాఉండగా నెల క్రితం వినియోగించిన విద్యుత్‌కు కూడా పెంచిన చార్జీల ను కలిపి బిల్లులు ఇచ్చారని భివండీ పవర్‌లూమ్ ఓనర్స్ అండ్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డపెల్లి లక్ష్మణ్, కార్యదర్శి సిరిపురం తిరుపతి, పోతు గంగాధర్, బొల్ల వీరేందర్, మ్యాకల్ అశోక్, గాలి శ్రీనివాస్ తదితర వ్యాపారులు ఆరోపించారు.

Advertisement
Advertisement