రజనీకి మోదీ కబురు | Sakshi
Sakshi News home page

రజనీకి మోదీ కబురు

Published Sun, Aug 9 2015 2:31 AM

రజనీకి మోదీ కబురు - Sakshi

 టీనగర్:  చెన్నైకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానిస్తూ నటుడు రజనీకాంత్ పుష్పగుచ్ఛం పంపారు. ఒక రోజు పర్యటన నిమిత్తం చెన్నైకు వచ్చిన మోదీ మళ్లీ ఢిల్లీ వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి సాయంత్రం మూడు గంటలకు చేరుకున్నారు. ఆ సమయంలో నటుడు రజనీకాంత్ తరపున పంపిన పుష్పగుచ్ఛం, లేఖ ఒకటి తీసుకొచ్చారు. మోదీ విమానాశ్రయంలోకి వెళ్లిన తర్వాత ఆలస్యంగా అవి తీసుకురావడంతో మోదీకి చేర్చే వీలులేకుండా పోయిందని బీజేపీ నిర్వాహకులు తెలిపారు.
 
 దీనిగురించి బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ ప్రధాని మోదీని స్వాగతిస్తూ నటుడు రజనీకాంత్ పంపిన పుష్పగుచ్ఛం చివరి సమయంలో తీసుకొచ్చినందున మోదీకి చేర్చలేకపోయామని, అయినప్పటికీ ఈ విషయం మోదీకి తెలిపామన్నారు. తర్వాత రజనీ లేఖను ఈమెయిల్ ద్వారా మోదీకి పంపామని తెలిపారు. తాను విదేశాల్లో ఉండడంతో కలవలేకపోయానిని, మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తితో ఉన్నట్లు రజనీ లేఖలో తెలిపారు. తాను కలుసుకోవడానికి ఆసక్తితో ఉన్నానని, ఢిల్లీ వస్తే కలుద్దామని మోదీ బదులిచ్చినట్లు తమిళిసై తెలిపారు.

Advertisement
Advertisement