ముంబై: ముంబై హైకోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. దీంతో హైకోర్టులో కొద్దిసేపు కార్యకలాపాలు నిలిచిపోయాయి. తనిఖీల అనంతరం బాంబు బెదిరింపు ఆకతాయిల పని అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మంజుల చెల్లూర్ సహాయకుల గది నంబర్-51 లో బాంబు అమర్చినట్లు బుధవారం గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు.
వెంటనే స్పందించిన అధికారులు బాంబ్ స్క్వాడ్ను రప్పించి తనిఖీలు చేపట్టారు. అధికారులను, సిబ్బందిని బయటకు పంపించి కోర్టు లోపల, ఆవరణలో అణువణువూ తనిఖీ చేపట్టగా ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు. దీంతో బెదిరింపు ఒట్టిదేనని తేల్చారు. పోలీసులు సూచనల మేరకు కోర్టు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.